న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటుపరం చేయడంలో నిమగ్నమైన నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను విక్రయించడానికి సంసిద్ధమవుతున్నది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) ప్రైవేటీకరణకు ఫైనాన్షియల్ బిడ్స్ను వచ్చే మార్చి త్రైమాసికంలో ఆహ్వానించనున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కంపెనీ నుంచి ప్రధానయేతర ఆస్తుల్ని, దానికున్న స్థలాలను వేరుపర్చే ప్రక్రియ ప్రస్తుతం తుదిదశలో ఉందని, ఇది మూడు నెలల సమయంలో పూర్తవుతుందని భావిస్తున్నామని, అటుతర్వాత వాటా విక్రయానికి ఫైనాన్షియల్ బిడ్స్ను పిలుస్తామని ఆ అధికారి పీటీఐ వార్తా సంస్థకు వివరించారు. ముంబైలోని షిప్పింగ్ హౌస్, మారిటైమ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లతో సహా షిప్పింగ్ కార్పొరేషన్కు ఉన్న నాన్-కోర్ ఆస్తుల్ని వేరుపర్చి కొత్తగా ఏర్పాటుచేసిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అండ్ అసెట్స్ (ఎస్సీఐఎల్ఏఎల్)కు బదిలీచేసే డీమెర్జర్ స్కీమ్కు ఈ ఏడాది మే నెలలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. 2022 మార్చి 31నాటి బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఎస్సీఐ నుంచి వేరుపర్చడానికి ఉద్దేశించిన ఆస్తుల విలువ రూ. 2,392 కోట్లు.
డీమెర్జర్లో జాప్యం
ఎస్సీఐలో 63.75 శాతం పూర్తి ప్రభుత్వ వాటాను విక్రయించడానికి వాస్తవానికి 2020 నవంబర్ నెలలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2021 మార్చిలో ఎస్సీఐ ప్రైవేటీకరణకు బిడ్స్ అందినప్పటికీ, ఆ కంపెనీ ఆస్తుల డీమెర్జర్ ప్రక్రియలో జాప్యం జరిగింది. 2022-23 సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ. 65,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్లో నిర్దేశించుకోగా, ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా రూ. 24,544 కోట్ల సమీకరణ జరిగింది. ఎస్ఐసీ డిజిన్వెస్ట్మెంట్ వార్తల నేపథ్యంలో మంగళవారం ఈ షేరు ధర బీఎస్ఈలో 4 శాతంపైగా పెరిగి రూ. 118 వద్ద ముగిసింది.
ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయానికి వచ్చే నెలలో ఈవోఐ
ఐడీబీఐ బ్యాంక్లో వాటా విక్రయానికి ప్రిలిమినరీ బిడ్స్ను వచ్చే నెలలో ఆహ్వానించవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు మంగళవారం చెప్పారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు సంబంధించి రిజర్వ్బ్యాంక్, సెబీలతో చర్చించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయని, ఆర్బీఐతో చర్చలు తుదిదశలో ఉన్నాయన్నారు. సెప్టెంబర్ నెలలో ఆసక్తివ్యక్తీకరణ బిడ్స్ (ఈవోఐ) జారీచేయగలమని భావిస్తున్నామని వివరించారు. అయితే బ్యాంకింగ్, ఈక్విటీ మార్కెట్ రెగ్యులేటర్లయిన ఆర్బీఐ, సెబీలతో ప్రభుత్వం చర్చిస్తున్న రెగ్యులేటరీ అంశాలు ఏమిటన్న వివరాల్ని ఆ అధికారి వెల్లడించలేదు. బ్యాంకింగ్ రంగంలో పూర్తిగా ప్రైవేటుపరం చేస్తున్న బ్యాంక్ ఇదే అయినందున, ఈవోఐలు జారీఅయిన తర్వాత బిడ్డర్ల నుంచి పలు ప్రశ్నలు ఎదురుకావొచ్చని భావిస్తున్నామని, ఈ నేపథ్యంలో కసరత్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయ ప్రక్రియ పూర్తికాకపోవొచ్చన్నారు. ఈ బ్యాంక్లో యాజమాన్య నియంత్రణను బదిలీ చేయడంతో పాటు వ్యూహాత్మక వాటాను విక్రయించడానికి 2021 మే నెలలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఐడీబీఐ బ్యాంక్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉండగా, బ్యాంక్ ప్రస్తుత ప్రమోటర్ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వద్ద 49.24 శాతం వాటా ఉంది. తొలి బిడ్స్ ఆహ్వానించే ముందు.. ఎంత వాటా విక్రయించాలనేది ప్రభుత్వం, ఎల్ఐసీలు కలసి నిర్ణయిస్తాయి.