బీమాపై ధీమా…
ఇన్సూరెన్స్ చేసుకునేందుకు అన్ని ఆదాయ వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. 2017 జనవరిలో సగటున 13.55 శాతం కుటుంబాలు ఇనూరెన్స్ రంగంలో పెట్టుబడికి ఆసక్తి చూపగా, 2021 ఏప్రిల్ నాటికి అది 22.22 శాతానికి చేరింది. గతేడాది జనవరి-మార్చి మధ్య ఇది గరిష్ఠంగా 30 శాతాన్ని తాకింది.
4.28 %
ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారు తగ్గుతున్నారు. 2017 జనవరిలో అన్ని ఆదాయ వర్గాలు సగటున 14.13 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్లకు మొగ్గుచూపగా, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి అది 4.28 శాతానికి పడిపోయింది.
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): భారతీయులకు బంగారం అంటే అమితమైన ప్రేమ. అలంకరణ కోసమే కాదు.. చేతిలో డబ్బులుంటే ఖర్చవుతాయని బంగారం కొని పెట్టుకుంటాం. దశాబ్దాలుగా ఇదే మన నమ్మకమైన పెట్టుబడి. రెండు, మూడేండ్లుగా ఈ ఆలోచన ధోరణి మారుతున్నది. జీవిత బీమా, పీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, లిస్టెడ్ షేర్స్ వంటి వాటిని వ్యక్తిగత పొదుపు (పర్సనల్ సేవింగ్స్) మార్గాలుగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా కరోనాతో ఆలోచన ధోరణి మారిందని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలసిస్(సీఈడీఏ)- సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ)’ తెలిపింది. 2017 జనవరి నుంచి 2021 ఏప్రిల్ వరకు డేటాను విశ్లేషించి తాజాగా నివేదిక విడుదల చేసింది.
పీఎఫ్లో పెట్టుబడులు
ప్రావిడెంట్ ఫండ్ ప్లాన్ చేసుకుంటున్నవారి సంఖ్య గత నాలుగేండ్లలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. ముఖ్యంగా రూ.5-10 లక్షలు, రూ.10 లక్షలకుపైగా ఆదాయం ఉన్న కుటుంబాల్లో ఎప్పటినుంచో పీఎఫ్లో పెట్టుబడులు కొనసాగుతుండగా, గత మూడేండ్లుగా మిగతా ఆదాయ వర్గాల్లోనూ అవగాహన పెరిగిందని నివేదిక వెల్లడించింది. సగటున 2017 జనవరిలో 3.84 శాతం మంది పీఎఫ్పై ఆసక్తి చూపగా, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 10.19 శాతానికి పెరిగింది. లిస్టెడ్ షేర్స్లో పెట్టుబడి పెడదామని అనుకునేవారి సంఖ్య కూడా ఈ ఏడాది నుంచి పెరిగినట్టు నివేదిక తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ల పట్ల మధ్యాదాయ కుటుంబాల్లో పెద్దగా ఆదరణ పెరగలేదు.