ముంబై, ఆగస్టు 21: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ ఐటీ, మెటల్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ తిరిగి 65 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. ఒక దశలో 400 పాయింట్ల వరకు లాభపడిన సూచీ చివరకు 267.43 పాయింట్లు ఎగబాకి 65,216.09 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 83.45 పాయింట్లు అందుకొని 19,393.60 వద్ద స్థిరపడింది.
బజాజ్ ఫైనాన్స్ 2.70 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, నెస్లె, టాటా స్టీల్, టీసీఎస్, టైటాన్, యాక్సిస్లు లాభాల్లో ముగిశాయి. కానీ, రిలయన్స్, మహీంద్రాఅండ్మహీంద్రా, మారుతి, ఎస్బీఐలు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే యుటిలిటీ, పవర్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, టెక్, కమోడిటీస్, ఐటీ, హెల్త్కేర్ రంగ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లు ఒత్తిడికి గురైనప్పటికీ, ఐటీ, ఇతర రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీల వరుస నష్టాలకు బ్రేక్పడినట్లు అయిందని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.