NSE Nifty | ముంబై, ఆగస్టు 11: బ్యాంకింగ్, ఆటో షేర్ల నేతృత్వంలో భారీ ర్యాలీ జరగడంతో సోమవారం చరిత్రలో తొలిసారిగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,000 పాయింట్ల స్థాయిని అందుకుంది. ఇంట్రాడేలో 20,008 పాయింట్ల వద్ద ఆల్టైమ్ రికార్డుస్థాయిని నమోదుచేసిన నిఫ్టీ చివరకు 176 పాయింట్ల లాభంతో 20,996 వద్ద ముగిసింది. ఈ స్థాయిలో ఎన్ఎస్ఈ ప్రధాన సూచి ముగియడం కూడా ఇదే తొలిసారి. జూలై 20న నమోదైన 19,992 రికార్డుస్థాయిని తాజాగా ఛేదించింది. ఇక ఇదే సమయంలో సెన్సెక్స్ 67,000 పాయింట్ల స్థాయిని దాటి 528 పాయింట్ల లాభంతో 67,127 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్ గత రికార్డు గరిష్ఠస్థాయి 67,619 పాయింట్లుకాగా, అందుకు మరో 490 పాయింట్లు పెరగాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమ ధోరణితో ట్రేడవుతున్నా, దేశీయ సంస్థల కొనుగోళ్ల మద్దతుతో ర్యాలీ సాధ్యపడిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. స్పేస్, ఫారిన్ డిప్లమసీ విభాగాల్లో ఇటీవల భారత్ సాధించిన విజయాలు ఇక్కడి స్టాక్స్ పట్ల సెంటిమెంట్ మెరుగుపర్చినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో ధీరజ్ రెల్లి చెప్పారు. కూరగాయల ధరల తగ్గుదల కారణంగా ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం నెమ్మదిస్తుందన్న అంచనాలు కూడా ర్యాలీకి మరో కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
యాక్సిస్ బ్యాంక్ రికార్డు
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా యాక్సిస్ బ్యాంక్ 2.4 శాతం పెరిగి కొత్త రికార్డుస్థాయి 1,008 స్థాయిని తాకింది. పవర్గ్రిడ్, మారుతి, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఐటీసీ, నెస్లే, మహీంద్రా షేర్లు 1-2 శాతం మేర పెరిగాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, లార్సన్ అండ్ టుబ్రోలు స్వల్ప నష్టాలతో ముగిసాయి.
పీఎస్యూ బ్యాంక్ల జోరు
తాజా ర్యాలీలో పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లకు భారీ కొనుగోలు మద్దతు లభించింది. అంచనాలకంటే అధికంగా రుణ వృద్ధి జరిగినట్టు గణాంకాలు వెలువడటం, ఎన్పీఏలు తగ్గుతాయన్న అంచనాలతో పీఎస్యూ బ్యాంక్ షేర్ల పట్ల ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకొన్నదని వినోద్ నాయర్ చెప్పారు. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 1.4 శాతం మేర పెరిగి రూ.592 వద్ద ముగిసింది. మధ్యశ్రేణి బ్యాంక్ల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ షేర్లు 6 శాతంపైగా పెరిగాయి. పీఎస్బీ, మహారాష్ట్ర బ్యాంక్, యూకో బ్యాంక్లు 4-6 శాతం మధ్య లాభపడ్డాయి. పీఎన్బీ, సెంట్రల్ బ్యాంక్లు 3 శాతంపైగా ర్యాలీ జరిపాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 2.8 శాతం పెరిగి రూ.202.80 వద్ద ముగిసింది. యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లు 2 శాతం మేర లాభాలతో ముగిసాయి.
కదంతొక్కిన మిడ్క్యాప్
తాజా ర్యాలీలో లార్జ్క్యాప్ షేర్లతో పోలిస్తే మిడ్క్యాప్ షేర్లు మరింతగా పెరిగాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్క్యాప్ సూచి 1.2 శాతం పెరిగింది. స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం లాభపడింది. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే బీఎస్ఈ సర్వీసెస్ ఇండెక్స్ అత్యధికంగా 3 శాతం పెరిగింది. యుటిలిటీస్ ఇండెక్స్ 2.43 శాతం, టెలికమ్యునికేషన్స్ సూచి 2.32 శాతం, పవర్ ఇండెక్స్ 2.04 శాతం, ఆటోమొబైల్ 1.59 శాతం, బ్యాంకెక్స్ 1.06 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 0.97 శాతం చొప్పున పెరిగాయి. ఐటీ ఇండెక్స్ 1.07 శాతం, టెక్నాలజీ సూచి 0.91 శాతం,రియల్టీ ఇండెక్స్ 0.63 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 0.32 శాతం చొప్పున పెరిగాయి. ఎఫ్ఎంసీజీ 0.85 శాతం, కమోడిటీస్ సూచి 0.56 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈలో ట్రేడయిన మొత్తం షేర్లలో 2,107 స్టాక్స్ లాభపడగా, 1,665 షేర్లు నష్టపోయాయి. 370 కంపెనీలు 52 వారాల గరిష్ఠస్థాయిని తాకగా, 17 షేర్లు ఏడాది కనిష్ఠానికి తగ్గాయి.
కొద్దిరోజులుగా జరుగుతున్న వరుస ర్యాలీతో బీఎస్ఈలో లిస్టయిన మొత్తం షేర్ల విలువ కొత్త రికార్డుస్థాయి రూ.324.26 లక్షల కోట్లకు చేరింది. ఏడు రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 2,295 పాయింట్ల పెరగ్గా, ఈ సమయంలో ఇన్వెస్టర్ల సంపద రూ.14,67,416 కోట్లు పుంజుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయిస్తున్నప్పటికీ, వరుసగా ఏడవ రోజైన సోమవారం సైతం దేశీయ సంస్థలు, హైనెట్వర్త్, రిటైల్ ఇన్వెస్టర్ల మద్దతుతో కొత్త రికార్డులు సాధ్యపడినట్టు కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ చెప్పారు. క్రూడ్ ధర పెరుగుదల, రూపాయి క్షీణత, యూఎస్ బాండ్ ఈల్డ్స్ గరిష్ఠస్థాయికి చేరడం తదితర ఆందోళనలున్నా దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడం గమనార్హమని అన్నారు.
27 ఏండ్లలో 20 రెట్లు
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ-50 సూ చీని 20 ఏండ్ల క్రితం 1,000 పాయింట్ల వద్ద ప్రారంభించిందని, ఇప్పుడది 20 రెట్లు పెరిగి 20,000 పాయింట్లకు చేరిందని, దేశీయ క్యాపిటల్ మార్కెట్ల పట్ల దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకానికి ఇది నిదర్శనమని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో అశీష్కుమార్ చౌహాన్ అన్నారు. ట్రేడింగ్ టెక్నాలజీల్లోనూ, కార్పొరేట్ గవర్నెన్స్లోనూ ప్రపంచంలోనే ఎన్ఎస్ఈ ఉత్తమ గుర్తింపు తెచ్చుకున్నదని అన్నారు. తమ వద్ద 7.5 కోట్లమంది ఇన్వెస్టర్లు పాన్ నంబర్లతో రిజిష్టర్ చేసుకున్నారని, దేశంలో దాదాపు 5 కోట్ల కుటుంబాలు వారి పొదుపును ఈక్విటీ మార్కెట్లలోకి మళ్లిస్తున్నారని వివరించారు.
రైల్వే షేర్లు రయ్
మధ్యప్రాచ్య దేశాల్ని అనుసంధానిస్తూ యూరప్, దక్షిణాసియాల మధ్య వ్యాణిజ్యాన్ని పెంపొందించేందుకు రైలు మార్గాలతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు యూఎస్, సౌదీ అరేబియా, ఇండియా, ఇతర దేశాల మధ్య జరుగుతున్న చర్చలతో రైల్వేల సంబంధిత షేర్లు 15 శాతం వరకూ ఎగిసాయి. ఈ ర్యాలీలో అన్నింటికంటే అధికంగా ఇర్కాన్ ఇంటర్నేషనల్ 20 శాతం పెరిగింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ షేరు 10 శాతం పెరిగి రూ.84.50 వద్దకు చేరింది.