ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 231 పాయింట్లు లాభపడి 57,593 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 17,222 వద్ద ట్రేడింగ్ ముగిసింది. అంతకు ముందు సెన్సెక్స్ ఐదు పాయింట్ల లాభంతో 57,368, నిఫ్టీ ఆరు పాయింట్ల లాభంతో 17,160 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. గతవారం చివరి రోజు శుక్రవారం సెన్సెక్స్ 233 పాయింట్లు నష్టపోయి 57,362, నిఫ్టీ 70 పాయింట్లు పతనమై 17,153 పాయింట్ల వద్ద ముగిసింది.
సోమవారం ట్రేడింగ్ స్వల్ప లాభాలతో ప్రారంభమైనా.. ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు కొనసాగాయి. అయితే, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్యూఎల్ 3.77 శాతం వరకు లాభపడ్డాయి. నెస్లే, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్, హెచ్సీఎల్ టెక్, ఏషియన్స్ పెయింట్స్, విప్రో, ఎల్అండ్టీ నష్టాల్లో ముగిశాయి. రంగాల వారీగా బీఎస్ఈలో ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాకింగ్, ఎనర్జీ సూచనీలు టాప్ గ్రెయినర్లుగా నిలిచాయి. తాజాగా కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చైనా షాంఘైలో లాక్ డౌన్ విధించడంతో మదుపరుల సెంటిమెంట్ బలహీనపడడంతో ఆసియా షేర్లు పడిపోయాయి.