న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్ను టేకోవర్ చేయడానికి ఏడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఈ సంస్థలు ఈ నెల 10 (మంగళవారం) వ తేదీన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) ముందు వర్చువల్ ప్రెజెంటేషన్ సమర్పించనున్నాయి. బిడ్లు దాఖలు చేసిన సంస్థల్లో జేఎం ఫైనాన్సియల్, ఎర్న్స్ట్ అండ్ యంగ్, డెల్లాయిట్ టచ్ తోమస్తు ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కేపీఎంజీ, ఆర్బీఎస్ఏ క్యాపిటల్ అడ్వైజర్స్ , ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నాయి.
ప్రస్తుతం బ్యాంకులో 94 శాతానికి పైగా వాటా కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీలకు ఉంది. ఎల్ఐసీ 49.24 శాతం, కేంద్రం 45.48 శాతం వాటా కలిగి ఉన్నాయి. నాన్ ప్రమోటర్ వాటా 5.92 శాతంగా ఉంది. అయితే, ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) దశకు ముందు బ్యాంకు నుంచి ప్రభుత్వం తాను ఉపసంహరించనున్న వాటా ఎంత అన్న విషయం ప్రకటించనున్నది.
ఐడీబీఐ బ్యాంకులో యాజమాన్య నియంత్రణ వాటా బదిలీ ప్రక్రియలో దీపంకు సహకరించేందుకు ప్రొఫెషనల్ కన్సల్టింగ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు, మర్చంట్ బ్యాంకర్స్, ఫైనాన్సియల్ ఇన్స్ట్యూషన్స్, బ్యాంకుల నుంచి గత జూన్లో కేంద్ర ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. తొలుత బిడ్లు దాఖలు చేయడానికి గత నెల 13 గడువుగా ప్రకటించిన కేంద్రం.. తర్వాత 22కు పొడిగించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ ముగుస్తుందని ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, వాటాల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల నిధులు సమీకరించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.