హైదరాబాద్, సెప్టెంబర్ 26(కేపీహెచ్బీ కాలనీ): హైదరాబాద్లో మరో అతిపెద్ద మాల్ అందుబాటులోకి రాబోతున్నది. అబుదాబీకి చెందిన లులు గ్రూపు తాజాగా నగరంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్ను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, లులు గ్రూపు సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ ప్రారంభించనున్నారు. మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంఏ అశ్రఫ్ అలీ మాట్లాడుతూ…గతేడాది దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా లులు గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో అనేక చర్చలు జరిగి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందన్నారు. మంత్రి కేటీఆర్కు ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రంలో రూ.500 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చామని, దీంట్లో భాగంగానే రూ.300 కోట్లతో హైదరాబాద్లో మొట్టమొదటి మాల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అవతరించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర గ్లోబల్ నగరాలకు పోటీగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నదని, ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు కేటీఆర్ ప్రోత్సాహం వల్లనే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. తెలంగాణలో సుస్థిరమైన పాలన, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు లభిస్తుండటం కూడా ప్రధాన కారణమన్నారు.
అంతర్జాతీయ నగరంగాహైదరాబాద్లో మరో అతిపెద్ద మాల్ అందుబాటులోకి రాబోతున్నది. అబుదాబీకి చెందిన లులు గ్రూపు తాజాగా నగరంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్ను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, లులు గ్రూపు సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ అవతరించింది. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుండటంతో ఇతర గ్లోబల్ నగరాలకు పోటీగా హైదరాబాద్ అన్ని రంగాల్లో రాణిస్తున్నది. తెలంగాణలో సుస్థిరమైన పరిపాలన, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారాలు లభిస్తుండటం వల్లనే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాం.
– ఎంఏ అష్రఫ్ అలీ, లులు గ్రూపు
ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ప్రస్తుతం మెట్రో నగరాలకు పరిమితమైన లులు గ్రూపు..తాజాగా చిన్న నగరాలవైపు చూస్తున్నది. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నెలకొల్పబోతున్నట్టు కంపెనీ ప్రతినిధి తెలిపారు. రాష్ట్రంలో వరంగల్, నిజామాబాద్, కరీంనగర్లతోపాటు ఇతర చిన్న నగరాలకు సైతం వీటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు అశ్రఫ్ అలీ తెలిపారు. అలాగే వ్యాపార విస్తరణలో భాగంగా భవిష్యత్తుతో చెన్నై, అహ్మదాబాద్ల్లో కూడా మాల్స్ నెలకొల్పాలనుకుంటున్నట్టు చెప్పారు. అలాగే రూ.200 కోట్లతో చేపల ప్రాసెసింగ్ యూనిట్ను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లులు గ్రూప్ ఇండియా సీఈవో అండ్ డైరెక్టర్ ఎంఏ నిషాద్, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ వీ నందకుమార్, లులు గ్రూప్ ఇండియా సీవోవో రేజిత్ రాధాకృష్ణన్, లులు తెలంగాణ రీజినల్ డైరెక్టర్ అబ్దుల్ సలీం, లులు మాల్ హైదరాబాద్ మేనేజర్ ఇజిల్ ఎరాసన్, లులు హైపర్ మార్కెట్ జనరల్ మేనేజర్ నౌషద్ కిజక్కుప్పురత్లు హాజరయ్యారు.
నగరంలో ఇప్పటికే మాల్ను ఏర్పాటు చేసిన లులు గ్రూపు..భవిష్యత్తులో ఇక్కడ డెస్టినేషన్ షాపింగ్ మాల్ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న ఈ మాల్ వచ్చే రెండేండ్లలో అందుబాటులోకి రానున్నట్టు అశ్రఫ్ అలీ తెలిపారు. ఈ డెస్టినేషన్ మాల్ కోసం ఇప్పటికే స్థలాన్ని గుర్తించడం జరిగిందన్న ఆయన..ఎక్కడ ఏర్పాటు చేసే విషయాన్ని వెల్లడించలేదు. ఇతర కంపెనీ వర్గాల ప్రకారం వనస్థాలిపురంలో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తున్నది. హైదరాబాద్ ప్రజలకు ప్రపంచస్థాయి షాపింగ్ అనుభవాన్ని కల్పించడానికి సంస్థ కృషి చేస్తున్నదని, దీంట్లోభాగంగానే ఈ డెస్టినేషన్ మాల్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.