ముంబై, మార్చి 14: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. వరుసగా ఐదోరోజు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్ల ఇచ్చిన దన్నుతోపాటు క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్లకు జోష్నిచ్చింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య మరోసారి చర్చలు జరుగుతుండటం మార్కెట్లో సెంటిమెంట్ను మెరుగుపరిచింది. దీంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 56 వేల మార్క్ను అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి 935.72 పాయింట్లు లేదా 1.68 శాతం లాభపడి 56,486 పాయింట్ల వద్ద ముగిసింది సెన్సెక్స్. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 240.85 పాయింట్లు(1.45 శాతం) అందుకొని 16,871.30 వద్ద స్థిరపడింది.
ఐదు రోజుల్లో 13 లక్షల కోట్లు
మదుపరులు లాభాల జడివానలో తడిసిముద్దవుతున్నారు. గడిచిన ఐదు రోజులుగా స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో మదుపరుల సంపద రూ.13 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.13,16,944.74 కోట్లు పెరిగి రూ.2,54,27,775.78 కోట్లకు ఎగబాకింది. గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో సూచీ 3,643.27 పాయింట్లు (6.89 శాతం) చొప్పున లాభపడింది.