Stcoks |మరో 24 గంటల్లో కాల గర్భంలో కలిసిపోనున్న 2022లో చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే సరిపెట్టుకున్నాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో శుక్రవారం ఉదయం షేర్లు లాభాలతో మొదలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ శుక్రవారం ఉదయం ట్రేడింగ్ 61,393 పాయింట్ల వద్ద సాగింది. కానీ అటుపై ప్రారంభ లాభాలు హరించుకుపోయాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్ బలహీనతలతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి 60,744 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. 552 పాయింట్లు నష్టపోయి 60,841 పాయింట్ల వద్ద ముగిసింది. నష్టాలతో ముగిసినా ఈ వారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 1.7 శాతం.. ఈ ఏడాది 4.4 శాతం లబ్ధి పొందింది.
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ ఉదయం 18,259.10 పాయింట్ల వద్ద మొదలైన నిఫ్టీ ట్రేడింగ్.. ఇంట్రాడేలో 18,265.25 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లి, 18,080.30 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. ముగింపు సమయానికి 82.73 పాయింట్ల నష్టంతో 18,105.30 పాయింట్ల వద్ద స్థిర పడింది. కానీ ఈ వారంలో నిఫ్టీ 1.7 శాతం, 2022లో 4.3 శాతం లాభాలతో స్థిర పడింది.
బీఎస్ఈ-30 ఇండెక్స్లో ఐసీఐసీఐ బ్యాంక్ 1.5 శాతానికి పైగా నష్టపోయింది. దాదాపు 100 పాయింట్ల వరకు సెన్సెక్స్ పతనానికి ఐసీఐసీఐ బ్యాంక్ స్క్రిప్ట్ కారణం. ఇంకా భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, నెస్ట్లే ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, లార్సెన్ అండ్ టర్బో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తదితర షేర్లు నష్టాలతో సరిపెట్టుకున్నాయి.
బజాజ్ ఫిన్ సర్వ్ రెండు శాతానికి పైగా లాభపడితే, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ ఒక్కోశాతం చొప్పున పుంజుకున్నాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.4 శాతం, స్మాల్ క్యాప్ 0.8 శాతం లాభపడ్డాయి. సుమారు 2,200 షేర్లు లబ్ధి పొందితే, 1300 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి.
ఈ ఏడాదిలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.4 శాతం లాభ పడితే, స్మాల్ క్యాప్ 1.8 శాతం నష్టపోయింది. కన్జూమర్ డ్యూరబుల్స్ 0.8 శాతం, మెటల్, రియాల్టీ ఇండెక్స్ లాభాలతో ముగిస్తే, ఎఫ్ఎంసీజీ, పవర్, బ్యాంకెక్స్ నష్టపోయాయి. ఇక ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.82.73 వద్ద స్థిర పడింది.