Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు నష్టాలతో ముగిశాయి. ప్రత్యేకించి ఆటో, ఐటీ, మెటల్ స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి. ఉదయం నుంచి స్టాక్స్ నష్టాల్లోనే సాగాయి. ఇప్పటి వరకు వరుసగా ఏడు సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 2032 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 643 పాయింట్ల నష్టంతో ముగిశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో మరోసారి యూఎస్ ఫెడ్ రిజర్వు మళ్లీ వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాల మధ్య ఇన్వెస్టర్లు సోమవారం ట్రేడింగ్కు దూరంగా ఉన్నారు. ఫలితంగా ట్రేడింగ్లో రోజంతా ఇన్వెస్టర్లకు నష్టాలే మిగిలాయి.
యూఎస్ డాలర్ ఇండెక్స్ 105 పాయింట్లు పెరుగడంతో భారత్ రూపాయిపై మరింత ఒత్తిడి పెరుగుతుందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. సోమవారం ఇంట్రా డేలో నష్టాల్లోకి వెళ్లిన బ్యాంకింగ్ స్టాక్స్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి స్మార్ట్ లాభాలతో స్థిర పడ్డాయి.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 176 పాయింట్ల పతనంతో 56,288 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రా డే ట్రేడింగ్లో 59,331.31 పాయింట్ల వద్ద నష్టాలతో మొదలై 59,441.13 పాయింట్ల నుంచి 58,937.64 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 175.58 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 17,428.60 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలై 17,451.60-17,299 పాయింట్ల మధ్య కదలాడింది. ట్రేడింగ్ ముగింపులో 73.10 పాయింట్ల నష్టంతో 17,392.70 పాయింట్ల వద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.82.81 వద్ద స్థిర పడింది.
బీఎస్ఈ సెన్సెక్స్-30 ఇండెక్స్లో బ్యాంకింగ్ మేజర్స్ స్టాక్స్ రికవరీ సాధించాయి. ఐసీఐసీఐ బ్యాంకు రెండు శాతం, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ గణనీయ లాభాలతో ముగిశాయి. ఎన్టీపీసీ కూడా గణనీయ లాభంతోనే స్థిర పడింది. మరోవైపు టాటా స్టీల్ మూడు శాతం, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ నష్టాలతో సరిపెట్టుకున్నాయి.