ముంబై: వరుసగా రెండో రోజు బుల్స్ కదంతొక్కడంతో బీఎస్ఈ సెన్సెక్స్ అవలీలగా 57,000 పాయింట్ల శిఖరంపై పాగా వేసింది. క్రితం ట్రేడింగ్ సెషన్లో 700 పాయింట్లకుపైగా పెరిగిన సెన్సెక్స్ మంగళవారం మరో 663 పాయింట్లు ర్యాలీ జరిపి 57,552 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 17,000, 17,100 పాయింట్ల స్థాయిల్ని ఒక్క ఉదుటన దాటేసింది. ఈ సూచి 201 పాయింట్లు పెరిగి 17,132 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ రెండు ప్రధాన సూచీలు కొత్త రికార్డుస్థాయిల్లో క్లోజ్కావడం గమనార్హం. సెన్సెక్స్ ఇంట్రాడేలో 57,625 పాయింట్ల గరిష్ఠాన్ని, నిఫ్టీ 17,153 పాయింట్ల గరిష్ఠాన్ని తాకాయి. క్యూ1 జీడీపీ గణాంకాలు విడుదలకానున్న నేపథ్యంలో కొనుగోళ్లు జోరందుకున్నాయని ట్రేడర్లు తెలిపారు. కాగా మార్కెట్ ట్రేడింగ్ వేళలు ముగిసిన తర్వాత జీడీపీ 20.1 శాతం వృద్ధిచెందినట్లు సెంట్రల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) వెల్లడించింది. డాలరుతో పోల్చితే రూపాయి మారకపు విలువ బలపడటం కూడా మార్కెట్కు జోష్నిచ్చిందని ట్రేడింగ్ వర్గాలు పేర్కొన్నాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా భారతి ఎయిర్టెల్ 7 శాతం ర్యాలీ జరిపింది. ఈ కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్&మొబైల్ టారీఫ్లను పెంచే సంకేతాలివ్వడంతో ఈ షేరులో భారీగా కొనుగోళ్లు జరిగాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఆసియన్ పెయింట్స్, టైటాన్, టీసీఎస్, టెక్ మహింద్రాలు 4.9 శాతం వరకూ లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే ఫైనాన్షియల్స్, టెలికాం, మెటల్స్, ఫార్మాలు పటిష్టంగా ట్రేడయ్యాయి.
ఒకే నెలలో 9 శాతం..
ఈ ఏడాది ఇప్పటివరకూ 15 శాతం పెరిగిన స్టాక్ సూచీలు ఒక్క ఆగస్టు నెలలోనే 9 శాతం పెరిగాయి. ఆగస్టు తొలినాళ్లలో 54,000 పాయింట్ల స్థాయిని దాటిన సెన్సెక్స్..చివరిరోజున 57,500 పాయింట్లపైకి ఎగిసింది. నిఫ్టీ 15,600 పాయింట్ల స్థాయి నుంచి 17,150 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపింది.
2.70 లక్షల కోట్లు పెరిగిన సంపద
తాజా మార్కెట్ ర్యాలీతో మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.2.70 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ ఆల్టైమ్ గరిష్ఠం రూ. 2,50,02,084 కోట్లకు చేరింది.
11 నెలల గరిష్ఠానికి రూపాయి
అమెరికా కేంద్ర బ్యాంక్ సరళతర విధానాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మంగళవారం మరో 29 పైసలు పుంజుకుని 11 నెలల గరిష్ఠం 73 వద్దకు చేరింది. డాలరు ఇండెక్స్ బలహీనపడుతున్న కారణంగా రూపాయి బలపడుతున్నదని ఫారెక్స్ డీలర్లు తెలిపారు.
రూ.14 లక్షల కోట్లపైకి టీసీఎస్ విలువ..
టీసీఎస్ మార్కెట్ విలువ తొలిసారిగా రూ.14 లక్షల కోట్ల స్థాయిని దాటింది. మంగళవారం ఈ షేరు 2.7 శాతం పెరిగి రూ.3,802 రికార్డుస్థాయికి చేరడంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.14,00,664 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం దేశంలో అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువకు (రూ.14,32,270 కోట్లు) టీసీఎస్ విలువ చేరువలో ఉంది. ఈ ఏడాది జనవరిలో రూ.12 లక్షల కోట్లు దాటిన టీసీఎస్ విలువ ఈ ఆగస్టు 17న రూ.13 లక్షల కోట్లను మించింది.
సెన్సెక్స్ అధిరోహణ
50,000 జనవరి 21, 2021
51,000 ఫిబ్రవరి 5, 2021
52,000 ఫిబ్రవరి 15. 2021
53,000 జూన్ 22, 2021
54,000 ఆగస్టు 4, 2021
55,000 ఆగస్టు 13, 2021
56,000 ఆగస్టు 28, 2021
57,000 ఆగస్టు 31, 2021