ముంబై, సెప్టెంబర్ 30: వడ్డీరేట్లను పెంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చింది. గత ఏడు రోజులుగా నష్టాలే పరమావదిగా పయనిస్తున్న సూచీలు శుక్రవారం భారీగా లాభపడ్డాయి. లాభాల్లో ప్రారంభమైన సూచీలు కడవరకు అదే ట్రెండ్ను కొనసాగించాయి. ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నప్పటికీ దేశీయ సూచీలు మాత్రం లాభపడటం విశేషం. వారాంతం ట్రేడింగ్ ముగిసేసరికి సూచీ తిరిగి 57 వేల మార్క్ను అధిగమించింది. ఇంట్రాడేలో 1,312 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 1,016.96 పాయింట్లు(1.80 శాతం) లాభపడి 57,426.92 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 276.25 పాయింట్లు(1.64 శాతం) అందుకొని 17,094.35 వద్ద ముగిసింది. వడ్డీరేట్లను పెంచినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేయడం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపిందని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించారు.
భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా 4.49 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది
ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, మారుతి, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్లు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి.
సన్ఫార్మా, ఎల్అండ్టీ, ఎస్బీఐ, అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, మహీం ద్రా అండ్ మహీంద్రా, నెస్లె, టీసీఎస్, విప్రో, ఎన్టీపీసీలు అధికమయ్యాయి.
కానీ, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్లు మాత్రం నష్టపోయాయి.
మొత్తంమీద ఈవారంలో సెన్సెక్స్ 672 పాయింట్లు(1.15 శాతం), నిఫ్టీ 233 పాయింట్లు(1.34 శాతం) మేర పడిపోయాయి.
బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 1.45 శాతం, మిడ్క్యాప్ ఇండెక్స్ 1.39 శాతం చొప్పున పెరిగాయి.
రంగాల వారీగా చూస్తే టెలికం రంగ సూచీ అత్యధికంగా 3.49 శాతం, మెటల్ 2.66 శాతం, ఫైనాన్షియల్ సర్వీసులు 2.36 శాతం, రియల్టీ 1.94 శాతం, పవర్ 1.94 శాతం చొప్పున అధికమయ్యాయి. కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ మాత్రం స్వల్పంగా నష్టపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 1.19 శాతం పెరిగి 89.54 డాలర్లు పలికింది.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 37 పైసలు బలపడి 81.36 వద్ద నిలిచింది.