Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ శుక్రవారం సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. దేశీయ ఆర్థిక వృద్ధిరేటు ఊహించిన దానికన్నా మెరుగ్గా పుంజుకోవడం, అమెరికా ద్రవ్యోల్బణం అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడింది. దీంతో బ్లూచిప్ ఇండెక్స్ ఎన్ఎస్ఈ నిఫ్టీ-50.. 356 పాయింట్లు (1.6శాతం) పెరిగి 22,339 పాయింట్ల వద్ద, బీఎస్ఈ-30 సూచీ సెన్సెక్స్ 1245 (1.72శాతం) పాయింట్లు పుంజుకని 73,745 పాయింట్ల వద్ద ముగిసింది.
దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.16 లక్షల కోట్లు పెరిగి రూ.392.11 లక్షల కోట్లకు చేరుకున్నది. ఐటీ మినహా మీడియా, ఫార్మా అండ్ హెల్త్ కేర్ మినహా అన్ని సెక్టోరల్ ఇండెక్సులు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు, ఆటో, ఫైనాన్సియల్ సర్వీసెస్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్సులు రెండు శాతానికి పైగా లాభ పడ్డాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ లు దాదాపు ఒక శాతం చొప్పున లాభ పడ్డాయి.
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 8.4 శాతానికి పెంచుకున్నది. గత ఆరు త్రైమాసికాల్లో శరవేగంగా సాధించిన ప్రగతి ఇది. మాన్యుఫాక్చరింగ్, నిర్మాణ రంగ కార్యకలాపాలు పుంజుకోవడం కలిసి వచ్చింది. జూన్ నెలలో అమెరికా ఫెడ్ రిజర్వు, యూరోపియణ్ యూనియన్ సెంట్రల్ బ్యాంక్ రుణ ఖర్చులు తగ్గించనుండడంతో యూరప్ స్టాక్స్ (Stoxx) 600 పాయింట్లు పుంజుకున్నది. జపాన్ నిక్కీ 1.9 శాతం పెరిగి తాజా ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి. గురువారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,568 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేస్తే, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.230 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. గత నెలలో ఇండియన్ ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,107 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.