Stock Markets | ఐటీ స్టాక్స్ మద్దతుతో సెలెక్టెడ్ బ్యాంక్ స్టాక్స్ సారధ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం సరికొత్త రికార్డు నెలకొల్పాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 72,721 పాయింట్ల న్యూ లైఫ్ టైం గరిష్ట స్థాయిని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 847 పాయింట్ల (1.18 శాతం) లాభంతో 72,568 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం అంతర్గత ట్రేడింగ్లో 21,928 పాయింట్ల న్యూ లైఫ్ టైం గరిష్టానికి దూసుకెళ్లింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 247 పాయింట్ల (1.14 శాతం) లబ్ధితో 21,895 పాయింట్ల వద్ద స్థిర పడింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) మూడో త్రైమాసికంలో ఐటీ జెయింట్ ఇన్ఫోసిస్ సొంతం చేసుకున్న కొత్త డీల్.. సంస్థ మొత్తం డీల్స్లో 71 శాతం అని పేర్కొనడంతో ఇన్ఫీ స్క్రిప్ట్ 8 శాతం పుంజుకున్నది. దీంతోపాటు ఓఎన్జీసీ, ఎల్ అండ్ టీ మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, గ్రాసిం ఇండస్ట్రీస్, ఐటీసీ 1-5.7 శాతం మధ్య లాభ పడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 37,941 పాయింట్లు, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 44,644 పాయింట్ల స్థాయికి దూసుకెళ్లాయి. రెండు ఇండెక్స్లూ 0.4 శాతం చొప్పున లబ్ధి పొందాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5.27 శాతం పుంజుకోగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2.7 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.6 శాతం లాభాలతో ముగిశాయి.