Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల నష్టానికి తెర పడింది. సోమవారం మార్కెట్లో ఈక్విటీలు సుమారు ఒకశాతం పుంజుకున్నాయి. ఫార్మా, హెల్త్కేర్ మినహా అన్ని సెక్టార్ల స్టాక్స్కు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు గత నాలుగు రోజుల్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.79 లక్షల కోట్లు పెరిగి రూ.277.91 లక్షల కోట్లకు చేరుకున్నది. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 721 పాయింట్ల లబ్ధితో 60,566 మార్క్కు చేరింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ-50.. 18 వేల మార్క్ను దాటింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్లో ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్ 4.17, బజాజ్ ఫిన్సర్వ్ 2.53, టాటా స్టీల్ 2.69, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ 2.44 శాతం లాభ పడ్డాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.99 శాతం, ఆల్ట్రాటెక్ సిమెంట్ 2.38, ఎన్టీపీసీ 1.63, టాటా మోటార్స్ 1.70, ఐసీఐసీఐ బ్యాంక్ 1.63 శాతం పుంజుకున్నాయి.
మరోవైపు నెస్ట్లే 1.17 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంక్ 0.46, భారతీ ఎయిర్టెల్ 0.29, హెచ్సీఎల్ టెక్ 0.11, హెచ్యూఎల్ 0.14, సన్ ఫార్మా 0.15 శాతం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 7.29 శాతం, నిఫ్టీ మీడియా 2.85 శాతం లబ్ధిపొందాయి. ఆటో, రియాల్టీ, ఫైనాన్సియల్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ స్టాక్స్ కూడా పైపైకి దూసుకెళ్లాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 2.32, స్మాల్ క్యాప్ 3.52 శాతం లాభాలతో ముగిశాయి.
అంతకుముందు ఆసియా మార్కెట్లలో చైనా షాంఘై కంపోజిట్ 0.65 శాతం, జపాన్ నిక్కీ-225..0.66 శాతం, దక్షిణ కొరియా కొస్పీ 0.15 శాతం లాభ పడ్డాయి. మరోవైపు, సోమవారం ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి స్వల్పంగా పుంజుకున్నది. ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్పై రూపాయి విలువ రూ.82.65 వద్ద ముగిసింది. శుక్రవారం రూపాయి విలువ రూ.82.8575 వద్ద స్థిర పడింది.