Stock Markets | సెప్టెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ఠ స్థాయికి పెరిగి 7.41 శాతం నమోదు కావడంతో మళ్లీ వడ్డీరేట్లు పెరుగుతాయన్న భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. దీనికి తోడు ఆగస్టు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు 18 నెలల కనిష్టానికి పడిపోయాయి. దీంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగింది. వారాంతపు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ తేదీ ముగియడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 17 వేల మార్క్ పైనే కొనసాగినా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 391 పాయింట్ల నష్టంతో 57,235 పాయింట్ల వద్ద ముగిసింది.
మరో దఫా ఆర్బీఐ 50 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచుతుందన్న భయాల మధ్య బీఎస్ఈ సెన్సెక్స్లో రోజంతా నెగెటివ్ ట్రేడింగ్ కొనసాగింది. ఒకానొక దశలో 57,056 పాయింట్ల కనిష్ఠ ప్థాయికి పడిపోయింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఇంట్రా డే ట్రేడింగ్ 17,112 పాయింట్ల నుంచి 16,957 పాయింట్ల మధ్య సాగి ముగింపు సమయానికి 107 పాయింట్ల నష్టంతో 17,017 పాయింట్ల వద్ద స్థిర పడింది.
బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ 0.4 శాతం నష్టాలతో ముగశాయి. సెన్సెక్స్-30 ఇండెక్స్లో విప్రో భారీ నష్టంతో ముగిసింది. మూడో త్రైమాసిక గైడెన్స్ అంచనాల్లో కోత విధించడంతో విప్రో స్టాక్ ఇంట్రా డే ట్రేడింగ్లో 52 వారాల కనిష్ఠాన్ని తాకి దాదాపు ఏడు శాతం నష్టపోయింది. ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ ప్రధానంగా పతనం అయ్యాయి. 2022-23 గైడెన్స్ పెంచడంతో హెచ్సీఎల్ టెక్ అత్యధికంగా లాభ పడింది. బీఎస్ఈ బ్యాంకెక్స్, క్యాపిటల్ గూడ్స్, పవర్, రియాల్టీ ఇండెక్స్లు ఒక్కో శాతం నష్టాలతో సరిపెట్టుకున్నాయి. హెల్త్కేర్, మెడికల్ స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈలో 2100కి పైగా స్టాక్స్ నష్టాలతో ముగిస్తే 1300 స్క్రిప్ట్లు లాభాలతో స్థిర పడ్డాయి.