Stocks | అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలహీన పరిచాయి. ఆందోళన కరస్థాయిలోనే అమెరికా ద్రవ్యోల్బణం నమోదు కావడంతో జూన్ నుంచి యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న సంకేతాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
దీని ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 793 పాయింట్ల నష్టంతో 74,245 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 234 పాయింట్ల పతనంతో 22,519 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 74,189 పాయింట్లు, నిఫ్టీ 22,504 పాయింట్లకు పతనం అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ మీద 90.73 డాలర్లు పలుకడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలహీన పరిచింది.
సెన్సెక్స్ -30 ఇండెక్స్లో సన్ ఫార్మా నాలుగు, మారుతి 3.5 శాతం, పవర్ గ్రిడ్, టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఆల్ట్రాటెక్ సిమెంట్, లార్సెన్ అండ్ టర్బో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ, విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సుమారు 0.5 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్సులు నష్టాలతో ముగిశాయి.