Stocks | అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఐదు సెషన్ల లాభాలకు తెర పడింది. దీంతో ఇటు బీఎస్ఈ, అటు ఎన్ఎస్ఈ స్టాక్స్ 0.29 శాతం తగ్గాయి. దీంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 199 పాయింట్ల నష్టంతో 73,129 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 65 పాయింట్ల పతనంతో 22,032 పాయింట్ల వద్ద స్థిర పడింది.
మంగళవారం ఉదయం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 73,331.95 పాయింట్లతో స్వల్ప లాభాలతో మొదలైనా తర్వాత నష్టాల్లోనే సాగింది. అంతర్గత ట్రేడింగ్లో 72,960.29 పాయింట్ల కనిష్ట స్థాయి నుంచి 73,427.59 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 200 పాయింట్ల నష్టంతో 73,129 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.31 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.43 శాతం లబ్ధి పొందాయి. నిఫ్టీలో రియాల్టీ ఇండెక్స్ 1.95 శాతం, ఐటీ 1.3 శాతం, ఫార్మా 1.14 శాతం నష్టపోతే, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఒకశాతం లాభంతో ముగిసింది.
గత రెండు సెషన్లలో 7.1 శాతం పుంజుకున్న ఐటీ స్టాక్స్ మంగళవారం 1.3 శాతం నష్టంతో ముగిశాయి. హెచ్సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ తదితర స్టాక్స్ 1-2 శాతం మధ్య నష్టపోయాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్లో 2502 స్టాక్స్ నష్టాలతో, 1340 స్క్రిప్ట్లు లబ్ధి పొందగా, 87 స్టాక్స్ మాత్రం యధాతథంగా కొనసాగాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.12 లక్షల కోట్లు కోల్పోయింది.
అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ బ్యారెల్పై 1.25 శాతం పెరిగి 79.13 డాలర్లు పలికింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్ ధర 65 సెంట్లు పెరిగి 73.45 డాలర్లకు పెరిగింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ 21 పైసలు నష్టపోయి రూ.83.07 వద్ద ముగిసింది.