ముంబై, జనవరి 10: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు కొనుగోళ్లు జరపడంతో భారీ నస్టాల నుంచి లాభాల్లోకి వచ్చాయి. ఈవారంలోనే పారిశ్రామిక వృద్ధిరేటు, ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలకానుండటంతో పెట్టుబడిదారులు వేచి చూసే దోరణి అవలభించారు. ఫలితంగా నష్టాల్లో కదలాడిన సూచీలకు మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ సూచీలు లాభాల్లో ముగియడం జోష్నిచ్చింది.
71,110.98 పాయింట్ల నుంచి 71,733.84 పాయింట్ల మధ్య కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ చివరకు 71,657.71 వద్ద ముగిసింది. దీంతో 271.50 పాయింట్లు లాభపడినట్టు అయింది. నిఫ్టీ సైతం 73.85 పాయింట్లు అందుకొని 21,618.70 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.69 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటర్స్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టైటాన్ షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. కానీ, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, నెస్లె షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే సేవలు, కన్జ్యూమర్ డ్యూరబుల్, హెల్త్కేర్, ఇండస్ట్రీయల్స్ షేర్లు లాభాల్లో ముగియగా..ఎఫ్ఎంసీజీ, టెలికం, యుటిలిటీ, రియల్టీ, పవర్ రంగ షేర్లు నష్టపోయాయి.