Stocks | వచ్చేవారం కార్పొరేట్ సంస్థల తృతీయ త్రైమాసికం ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. వాటిల్లో ఎల్ అండ్ టీ, రిలయన్స్, ఐటీ స్టాక్స్ లాభపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 179 పాయింట్లు (0.25 శాతం) లబ్ధితో 72,026 పాయింట్లవద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 21,711 పాయింట్ల వద్ద స్థిర పడింది. టీసీఎస్, ఎల్ & టీ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, హెచ్యూఎల్ లాభాలు గడించగా, నెస్ల్టే, జేఎస్డబ్ల్యూ స్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ నష్టాలతో ముగిశాయి.
ఎవర్ రెన్యూ ఎమర్జెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి 225-వాట్ల పవన విద్యుత్ కొనుగోలు ఞప్పందం కుదుర్చుకోవడంతో సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 5 శాతం పెరిగాయి. బీఎస్ఈ ఇండెక్స్లో 2,224 స్టాక్స్ లాభ పడ్డాయి.ఆదాయం పన్నుశాఖ రూ.4000 కోట్ల పన్ను చెల్లించాలని శ్రీ సిమెంట్ యాజమాన్యానికి ఆదాయం పన్ను శాఖ నోటీసు జారీ చేసిందన్న వార్తల మధ్య శ్రీ సిమెంట్ షేర్లు 4.7 శాతం వద్ద మూత పడ్డాయి. నిఫ్టీ ఐటీ 1.3 శాతం, నిఫ్టీ-ఆటో, నిఫ్టీ బ్యాంక్, మెటల్, ఫార్మా, హెల్త్కేర్ స్టాక్స్ 0.10 లాభ పడ్డాయి.
గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో తొమ్మిది వారాల లాభాలకు బ్రేక్ పడింది. యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్ల తగ్గింపుపైనే అందరి దృష్టి నెకలొంది. యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ నాలుగు శాతం పెరిగింది. అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని యూఎస్ ఫెడ్ రిజర్వు సమావేశం ప్రకటించిన కొద్ది సేపటికే ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ ధర 38 సెంట్లు పెరిగి 77.97 డాలర్లు పలికింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడాయిల్ 51 సెంట్లు పెరిగి 72.69 డాలర్ల వద్ద స్థిర పడింది. అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ రూ.83.23 నుంచి రూ.83.15లకు పెరిగింది.