ముంబై, అక్టోబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య బ్యాంకింగ్, మెటల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,276.66 పాయింట్లు లేదా 2.25 శాతం ఎగిసి 58,065.47 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1,311.13 పాయింట్లు పుంజుకున్నది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 386.95 పాయింట్లు లేదా 2.29 శాతం ఎగబాకి 17,274.3 వద్ద నిలిచింది. మెటల్ షేర్లు 3.43 శాతం, సేవలు 3.08 శాతం, ఆర్థిక సేవలు 2.82 శాతం, బ్యాంకింగ్ 2.74 శాతం, ఐటీ షేర్లు 2.68 శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, ఎల్అండ్టీ, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు మదుపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో..
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్ల పరుగులే ఇందుకు కారణం. అగ్రరాజ్య జీడీపీ వృద్ధిరేటు ఆశాజనకంగా లేకపోవడంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు నెమ్మదిస్తుందన్న అంచనాలు మార్కెట్ల వ్యాప్తంగా విస్తరించాయని ట్రేడింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే డాలర్తో చూస్తే అమెరికా బాండ్ ఈల్డ్స్ పడిపోవడం కూడా మార్కెట్లలోకి మరి న్ని పెట్టుబడులకు దారితీసిందంటున్నారు. ఇక ఐరోపా స్టాక్ మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు లాభాల్లోనే కదలాడుతున్నాయి.
20 పైసలు పెరిగిన రూపాయి
గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి ఎట్టకేలకు కోలుకున్నది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా పుంజుకోవడం, డాలర్కు డిమాండ్ పడిపోవడంతో మారకం విలువ 20 పైసలు పెరిగింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సరికి మారకం విలువ 81.62 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ భగ్గుమన్నప్పటికీ రూపాయి విలువ పెరగడం విశేషమని ఫారెక్స్ డీలర్ తెలిపారు. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 81.66 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఒక దశలో 81.36 గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 20 పైసలు అందుకొని 81.62 వద్ద ముగిసింది. సోమవారం కూడా కరెన్సీ విలువ 42 పైసలు పెరిగిన విషయం తెలిసిందే.
పెరిగిన రూ.5.66 లక్షల కోట్ల సంపద
స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో మదుపరుల సంపద కూడా అదే స్థాయిలో ఎగిసింది. ఈ ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.5.66 లక్షల కోట్లు పుంజుకున్నది. రూ.5,66,318.84 కోట్లు ఎగబాకి రూ.2,73,92,739.78 కోట్లకు చేరింది. ‘అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉండటం.. భారతీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది’ అని కొటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఈక్విటీ రిసెర్చ్ అధిపతి శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. సెన్సెక్స్తోపాటు బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 2.42 శాతం, స్మాల్క్యాప్ సూచీ 1.49 శాతం పెరిగాయి.