Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం సరికొత్త రికార్డు నెలకొల్పాయి. ట్రేడింగ్ ముగియడానికి ఒక అర్థగంట ముందు ఐటీ ఇండెక్స్ భారీగా లబ్ధి పొందగా, బ్యాంకింగ్ స్టాక్స్ రికవరీ సాధించాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 502 పాయింట్ల లబ్ధితో 66,061 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా డే ట్రేడింగ్లో 66,160 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మరోవైపు ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ అంతర్గత ట్రేడింగ్లో న్యూ ఆల్ టైం గరిష్ట స్థాయి 19,595 పాయింట్ల వరకూ దూసుకెళ్లి.. ట్రేడింగ్ ముగింపు సమయానికి 151 పాయింట్ల లబ్ధితో 19,565 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఈ వారం సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్లు 1.2 శాతం లాభ పడ్డాయి.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్లో ఐటీ జెయింట్ టీసీఎస్ తొలి త్రైమాసికం ఫలితాల్లో ఐదు శాతం లబ్ధి పొందడంతో వరుసగా రెండో రోజు ర్యాలీ కొనసాగింది. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 4.5 శాతం, హెచ్సీఎల్ టెక్, విప్రో దాదాపు మూడు శాతం చొప్పున పుంజుకున్నాయి.
టాటా స్టీల్, నెస్ట్లే, హిందూస్థాన్ యూనీ లివర్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టర్బో స్టాక్స్ భారీగా లబ్ధి పొందాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒక్కోశాతం నష్టపోయాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒక శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.1 శాతం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 4.3 శాతం, మెటల్, రియాల్టీ ఇండెక్స్లు ఒక్కోశాతం చొప్పున లాభ పడ్డాయి.