Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం ప్రారంభం నుంచే బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ట్రేడింగ్ పాజిటివ్గా సాగింది. వారాంతానికి అమెరికా రుణ భారం పరిమితి పెంచేందుకు అంగీకారం కుదరనున్నదన్న వార్తలతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 345 పాయింట్ల లబ్ధితో 62,850 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 99.30 పాయింట్లు పుంజుకుని 18,600 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ తాజాగా ఆల్టైం హై 44,483పాయింట్లకు దూసుకెళ్లింది.
సోమవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 62,801.54 పాయింట్ల వద్ద లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. అంతర్గత ట్రేడింగ్లో 63,026 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి.. 62,801.54 కనిష్ట స్థాయికి పతనమైంది. ఈ ఏడాది సెన్సెక్స్ ఆల్టైం గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 344.69 పాయింట్ల లబ్ధితో 62,846.38 పాయింట్ల వద్ద ముగిసింది.
మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 18,619.15 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. అంతర్గత ట్రేడింగ్లో18,641.20 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి 18,581.25 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 99.30 పాయింట్ల లాభంతో 18,598.65 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ నాలుగు పైసల పతనంతో రూ.82.64 వద్ద ముగిసింది.
మహీంద్రా అండ్ మహీంద్రా నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో ఐదు శాతం పుంజుకోవడంతోపాటు సెన్సెక్స్ పుంజుకోవడానికి కారణమైంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ నాలుగో త్రైమాసికంలో రూ.248 కోట్ల నష్టం చవిచూడటంతో నాలుగు శాతం నష్టపోయింది. మరోవైపు హెచ్డీఎఫ్సీ ట్విన్స్ షేర్స్ కూడా రాణించాయి.
ఇంకా టైటాన్, టాటా స్టీల్స్, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఎన్టీపీసీ స్టాక్స్ లాభాలతో ముగిశాయి. మరోవైపు హెచ్సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, మారుతి సుజుకి, విప్రో, టీసీఎస్, సన్ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) గరిష్టంగా నష్టపోయాయి.