ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది. సెన్సెక్స్ 382 పాయింట్ల లాభంతో 52,232 వద్ద.. నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 15,690 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈలో స్పందనా స్ఫూర్తి ఫైనాన్స్, వీఎస్టీ టిల్లర్స్, నెల్కో లిమిటెడ్, భన్సాలీ ఇంజినీరింగ్, స్నోమాన్ లాజిస్టిక్స్ షేర్లు లాభపడగా.. మదర్సన్ సుమీ సిస్టమ్స్, కిరి ఇండస్ట్రీస్, ఏషియన్ గ్రానైట్ ఇండియా, టీసీఐ ఎక్స్ప్రెస్ షేర్లు నష్టపోయాయి.
నేటి ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు నిఫ్టీ ఆటో, ఫార్మా రంగం స్టాక్స్ నుంచి నిధులను మళ్లిస్తుండటంతో ఆయా రంగాల కంపెనీల షేర్లు నష్టపోయాయి. ఇక రియాల్టీ రంగం సూచీ నేటి ట్రేడింగ్లో అత్యధికంగా 4 శాతం లాభపడింది.