ముంబై, జూన్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థయైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభపడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు శాంతించడంతో మదుపరులు ఎగబడి కొనుగోళ్ళు జరిపారు. డాలర్తో పోలిస్తే రూపాయి మరింత పతనమవడం, విదేశీ నిధులు తరలించుకుపోతున్నప్పటికీ మదుపరులు వీటినేమి పట్టించుకోలేదు. ప్రారంభం నుంచి లాభాల బాటపట్టిన సూచీలు చివరి వరకు ఇదే ట్రేండ్ కొనసాగింది. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ 436.94 పాయింట్లు అందుకొని 55,818.11 పాయింట్లకు చేరుకున్నది. 55,382 వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 55,892 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 105.25 పాయింట్లు ఎగబాకి 16,628 వద్ద స్థిరపడింది.
వచ్చే మార్చికల్లా నిఫ్టీ @ 18,400: యాక్సిస్ సెక్యూరిటీస్ రిపోర్ట్
అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు తదితర అంశాలతో ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్ నెలకొని ఉన్నప్పటికీ, 2023 మార్చికల్లా నిఫ్టీ సూచి 18,400 పాయింట్లస్థాయికి పెరుగుతుందని యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. రెండు నెలలుగా వివిధ రంగాల షేర్లు మిశ్రమంగా ట్రేడ్కావడం మార్కెట్లో వస్తున్న మార్పును సూచిస్తున్నదని, సమీప భవిష్యత్తులో సైతం స్టాక్ సూచీలు పరిమితశ్రేణిలో కదులుతాయని యాక్సిస్ పేర్కొంది. అటుతర్వాత క్రమేపీ పెరుగుతూ నిఫ్టీ 18,400 పాయింట్ల లక్ష్యాన్ని చేరుతుందని యాక్సిస్ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది. ఈ స్థాయి 2024 ఆర్థిక సంవత్సరం కార్పొరేట్ లాభాలకు 20 రెట్లు విలువతో కూడినదని పేర్కొంది. వచ్చే ఒకటి, రెండేండ్ల కాలంలో వాల్యూ థీమ్ మార్కెట్లో అధిపత్యం వహిస్తుందని, సరైన ధర వద్ద గ్రోత్ థీమ్ పనిచేస్తుందని, ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో పెట్టుబడులకు దీర్ఘకాలంలో రిస్క్ రివార్డు సానుకూలంగా ఉందని వివరించింది. వ్యవస్థలో మూలధన వ్యయాల్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు పెంచడంతో బ్యాంక్ల పరపతి వృద్ధి మెరుగుపడుతుందని, 2022-23 బడ్జెట్లో నిర్దేశించిన వ్యయాల కారణంగా ఆర్థికాభివృద్ధి విస్త్రతస్థాయిలో ఉంటుందని యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది,