ముంబై, జూలై 7: కొద్ది వారాలుగా వరుస రికార్డులు నెలకొల్పుతున్న బీఎస్ఈ సెన్సెక్స్.. మరో కొత్త ఫీట్ సాధించింది. తొలిసారిగా 53,000 పాయింట్లపైన ముగిసింది. ఇటీవల ఈ సూచీ 53,000 పాయింట్ల స్థాయిని రెండు దఫాలు అధిగమించినప్పటికీ, ఆపైన నిలదొక్కుకోలేకపోయింది. అయితే బుధవారం మెటల్, ఫైనాన్షియల్ షేర్ల మద్దతుతో సెన్సెక్స్ 194 పాయింట్లు పెరిగి 53,055 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరో ప్రధాన స్టాక్ సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 61 పాయింట్లు ర్యాలీ జరిపి 15,880 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టాటా స్టీల్ 4.38 శాతం లాభపడింది. పెరిగిన షేర్లలో బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, పవర్గ్రిడ్లున్నాయి.