న్యూఢిల్లీ, డిసెంబర్ 19: భారత స్టాక్ మార్కెట్ వచ్చే 2024లో 10 శాతంవరకూ ర్యాలీ చేస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. గత ఏడాదికాలంగా 17 శాతం పెరిగిన నిఫ్టీ 2024 సంవత్సరాంతానికి మరో 8-10 శాతం లాభపడుతుందని భావిస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు. మంగళవారం నిఫ్టీ 21,453 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటీవలి వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించినందున కేంద్రంలో సైతం బీజేపీ అధికారాన్ని నిలుపుకుంటుందన్న అంశాన్ని ఇన్వెస్టర్లు ప్రైసింగ్ చేసుకుంటున్నారని, ఈ కారణంగా వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రభావం మార్కెట్పై పరిమితంగా ఉంటుందని కంపెనీ ఎండీ, సీఈవో ధీరజ్ రెల్లి చెప్పారు. ఎన్నికల ఫలితాల గురించి ఆందోళనచెందకుండా, మార్కెట్ను ప్రభావితం చేసే ఇతర అంశాల్ని గమనించాలన్నారు. కొత్త ఏడాది ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణం 2.5 శాతానికి తగ్గిపోతుందని, దీంతో రిజర్వ్బ్యాంక్ అరశాతం మేర వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్నారు.
స్మాల్, మిడ్-క్యాప్ షేర్లు ఇటీవలికాలంలో భారీగా పెరిగినందున, వీటి అప్సైడ్ పరిమితంగా ఉండవచ్చని, ఈ కారణంగా లార్జ్ క్యాప్స్వైపే మొగ్గుచూపుతున్నట్టు రెల్లి వెల్లడించారు. కొన్ని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు (పీఎంఎస్లు) వాటి స్మాల్-క్యాప్ స్కీముల్లో తాజా పెట్టుబడుల్ని తీసుకోవడం లేదని, వచ్చే ఏడాది పలు పీఎంఎస్లు ఇదేబాటను అనుసరిస్తాయన్నారు. అధిక విలువల కారణంగా పెట్టుబడికి ఏదో ఒక రంగాన్ని ఎంపికచేయడం కష్టసాధ్యమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ హెడ్ వరుణ్ లోహ్చాబ్ చెపుతూ ప్రతీ రంగం నుంచి స్టాక్స్ను ఆచితూచి ఎంచుకోవాలని ఇన్వెస్టర్లకు సూచించారు. తాము ఇండస్ట్రియల్స్, ఇన్ఫ్రా, రియల్టీ, సిమెంట్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగాలపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నామన్నారు. కన్జూమర్ స్టేపుల్స్, కన్జూమర్ డిస్క్రీషనరీ, కెమికల్స్ రంగాలపై నెగిటివ్ అవుట్లుక్ ఉన్నదని వివరించారు. గ్రామీణ డిమాండ్ బలహీనంగా ఉన్నందున వినియోగ సంబంధిత కంపెనీలు మంచి ఫలితాల్ని ఇవ్వకపోవచ్చని అంచనా వేస్తున్నామని ధీరజ్ రెల్లి చెప్పారు.
వరుస ర్యాలీలకు సోమవారం విరామం తీసుకున్న స్టాక్ మార్కె ట్ తిరిగి మంగళవారం కొత్త రికార్డుల్ని నెలకొల్పింది. సానుకూల అంతర్జాతీయ ట్రెండ్ ప్రభావంతో ప్రధాన సూచీలు రెండూ చరిత్రత్మాక గరిష్ఠస్థాయిని తాకాయి. ఇంట్రాడేలో 300 పాయింట్లకుపైగా పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ 71,623 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నమోదు చేసింది. చివరకు 122 పాయింట్ల లాభంతో 71,437 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో నిఫ్టీ ఇంట్రాడేలో చరిత్రలో తొలిసారిగా 21,500 స్థాయిని అధిగమించి 21, 505 పాయింట్లను తాకింది. చివరకు 34 పాయింట్ల లాభంతో 21,453 పాయింట్ల వద్ద నిలిచింది. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, కొన్ని బ్యాంకింగ్ షేర్లలో జరిగిన కొనుగోళ్లు మార్కెట్ ర్యాలీకి కారణమయ్యాయని, ఐటీ, ఆటో షేర్లు నష్టపోయినా, ఇతర రంగాల షేర్లు బాసటగా నిలిచాయని విశ్లేషకులు వివరించారు.