ముంబై, అక్టోబర్ 26: యూఎస్ బాండ్ ఈల్డ్స్, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ భయాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. అటు అమెరికా నుంచి ఇటు జపాన్ వరకూ జరుగుతున్న మార్కెట్ పతనబాటలోనే భారత్ సైతం పయనిస్తున్నది. బేర్స్ దాడుల్లో బుల్స్ విలవిలలాడుతున్నారు. అమ్మకాలు అదేపనిగా వెల్లువెత్తడంతో వరుసగా ఆరో రోజైన గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 900 పాయింట్ల పతనాన్ని చవిచూసింది. అక్టోబర్ 17 నుంచి ఆరు ట్రేడింగ్ రోజుల్లో ఇప్పటివరకూ ఈ సూచీ 3,279 పాయింట్లు కోల్పోయింది. తాజాగా ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 19,000 పాయింట్ల స్థాయిని వదులుకుంది. అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలం కొనసాగుతాయన్న అంచనాలతో యూఎస్ బాండ్ ఈల్డ్స్ మరో దఫా 5 శాతం స్థాయిని సమీపించడంతో రిస్కీ సాధనమైన స్టాక్స్ నుంచి వైదొలిగేందుకు విదేశీ ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలు జరపడంతో తాజా మార్కెట్ పతనం సంభవించిందని విశ్లేషకులు తెలిపారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ సంక్షోభంతోనూ సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. అలాగే అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టులకు ముగింపు రోజుకావడంతో గురువారం విక్రయాలు తీవ్రతరమయ్యాయన్నారు. సెన్సెక్స్ 900 పాయింట్ల నష్టంతో 64,000 స్థాయి దిగువన 63,148 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 265 పాయింట్లు కోల్పోయి 18,857 పాయింట్ల వద్ద నిలిచింది. వరుస పతనాల్ని చవిచూస్తున్న యూఎస్ మార్కెట్ సైతం బుధవారం నష్టాలతో ముగిసింది. ఇదేబాటలో గురువారం జపాన్ నికాయ్ సూచీ 600 పాయింట్లకుపైగా పతనమయ్యింది. యూరప్ సూచీలు కూడా ఇదేబాటలో నడిచాయి. ఈక్విటీలు ఇంతగా పడిపోతున్నా, క్రూడ్ ధర మాత్రం గరిష్ఠస్థాయిలోనే ట్రేడ్కావడం ఇన్వెస్టర్లను ఆందోళన పరుస్తున్నదని విశ్లేషకులు అన్నారు. తాజాగా బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 89 డాలర్ల ఎగువనే కదులుతున్నది.
ఎం అండ్ ఎం టాప్ లూజర్
అన్నింటికంటే అధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 4.06 శాతం పతనమయ్యింది. బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎల్అండ్టీ లు 1-4 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ ఐటీసీ, హెచ్సీఎల్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్లు లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీలను చూస్తే..ఆటో ఇండెక్స్ అధికంగా 1.81 శాతం పతనమయ్యింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.54 శాతం, మెటల్ 1.54 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.46 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ 1.41 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ 1.41 శాతం, టెలికమ్యూనికేషన్స్ 1.25 శాతం, రియల్టీ 1.22 శాతం, టెక్నాలజీ 1.16 శాతం పడిపోయాయి.
ఆరు రోజులుగా కొనసాగుతున్న వరుస పతనంతో రూ.18 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. గురువారం మార్కెట్ క్షీణతలో రూ.3 లక్షల కోట్ల సంపదను ఇన్వెస్టర్లు నష్టపోయారు. అక్టోబర్ 17న రూ.323.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ తాజాగా రూ.306 లక్షల కోట్లకు తగ్గింది.
భారత మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) అమ్మకాలు మరింత పెరిగాయి. ఎఫ్పీఐలు గురువారం ఒక్కరోజులోనే రూ. 7,700 కోట్లు వెనక్కు తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీలు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.