879 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్.. 245 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ముంబై, డిసెంబర్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడం, ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా మున్ముందు మరిన్ని వడ్డింపులుంటాయని ప్రకటించడం.. మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మరింతగా క్షీణించడం కూడా ప్రతికూలంగా పరిణమించింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 878.88 పాయింట్లు లేదా 1.4 శాతం పడిపోయి 61,799.03 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 245.4 పాయింట్లు లేదా 1.32 శాతం దిగజారి 18,414.9 వద్ద నిలిచింది.
ఉదయం ఆరంభం నుంచే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. సమయం గడుస్తున్నకొద్దీ మరింతగా పడిపోయాయి. ఈ క్రమంలోనే ప్రధానంగా ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్నాయి. టెక్ మహీంద్రా షేర్ విలువ అత్యధికంగా 3.98 శాతం పతనమైంది. ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లూ నిరాశపర్చాయి. అలాగే టైటాన్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, ఐటీసీ షేర్లూ నష్టాలకే పరిమితమయ్యాయి. రంగాలవారీగా చూస్తే.. ఐటీ షేర్ల సూచీ 2.06 శాతం, టెక్నాలజీ 1.92 శాతం, మెటల్ 1.82 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.37 శాతం, సర్వీసెస్ 1.28 శాతం, రియల్టీ 1.25 శాతం, ఆర్థిక సేవలు 1.19 శాతం, బ్యాంకింగ్ 1.18 శాతం, కమోడిటీస్ 1.17 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 1.05 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.61 శాతం క్షీణించాయి.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలోనూ లాభా ల స్వీకరణ ప్రధానంగా కనిపించింది. దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి. ‘అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయం మార్కెట్లలో పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణకు దారితీసింది’ అని కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రిసెర్చ్ (రిటైల్) అధిపతి శ్రీకాంత్ చౌహాన్ ట్రేడింగ్ సరళిని విశ్లేషించారు.
ఫారెక్స్ మార్కెట్లో రుపీ పతనం కొనసాగుతున్నది. డాలర్తో పోల్చితే రూపా యి మారకం విలువ గురువారం ట్రేడింగ్లో మరో 27 పైసలు క్షీణించి 82.76 వద్ద స్థిరపడింది. బుధవారం 82.49 వద్ద ముగిసిన రుపీ.. ఉదయం నష్టాలతోనే మొదలైంది. ఈ క్రమంలోనే తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.