ముంబై, మే 6 : దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. ఇరాన్తో జరుగుతున్న చర్చలు త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. క్రూడాయిల్ ధరలు భారీగా పతనం చెందడం పెట్టుబడిదారుల్లో జోష్ను పెంచింది. ఫలితంగా లాభాల్లో ప్రారంభమైన సూచీలకు చివర్లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మరో మెట్టుపైకి ఎక్కించాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా బలపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 940.73 పాయింట్లు లేదా 1.22 శాతం బలపడి 77,958.52 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 298.15 పాయింట్లు లేదా 1.24 శాతం అందుకొని 24,330.95 పాయింట్లకు చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లు అంచనాలకుమించి రాణించడం వల్లనే సూచీలు భారీగా పెరిగాయని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు చరమగీతం పాడటానికి అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉండటం, అలాగే క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం సూచీల్లో ర్యాలీకి దోహదం చేసిందని జియోజిట్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
చమురు ధరలు కుదేలు కావడంతో చమురు రంగ షేర్లతోపాటు పెయింటింగ్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్ల దిగువకు పడిపోవడం ప్రభుత్వరంగ చమురు సంస్థలకు అధిక లాభం చేకూరనుండటంతో వీటి షేర్లు కదంతొక్కాయి. దీంతో హెచ్పీసీఎల్ షేరు 6.89 శాతం బలపడగా, బీపీసీఎల్ షేరు 5.12 శాతం, ఐవోసీ షేరు కూడా 4.22 శాతం ఎగబాకింది.
రూపాయి విలువ మళ్లీ పుంజుకుంటున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ బుధవారం ఒకేరోజు 69 పైసలు ఎగబాకి 94.49కి ఎగబాకింది. క్రూడాయిల్ దిగిరావడంతో అమెరికా కరెన్సీ తీవ్ర ఆటుపోటులకు గురైందని ఫారెక్స్ ట్రేడర్ వెల్లడించారు. 95 వద్ద ప్రారంభమైన డాలర్-రూపాయి ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 95.18 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 69 పైసలు అందుకొని 94.49కి చేరుకున్నది.