ముంబై, జనవరి 11: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్లకు లభించిన మద్దతుతో సెన్సెక్స్ 60,500 పాయింట్లను అధిగమించింది. ఇంట్రాడేలో 60,689 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 221.26 పాయింట్లు లాభపడి 60,618.89 వద్ద ముగిసింది. 52.45 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 18,055.75 వద్ద స్థిరపడింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ దేశీయ సూచీలు లాభపడటం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలు తమ ఆర్థిక ఫలితాలను బుధవారం ప్రకటించనుండటంతో ఈ రంగ షేర్లు భారీగా పెరిగాయి.
నాలుగు శాతానికి పైగా పెరిగి హెచ్సీఎల్ టెక్ టాప్ గెయినర్గా నిలిచింది.
హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, సన్ఫార్మా, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, నెస్లె, అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, మారుతి, యాక్సిస్ బ్యాంక్, విప్రోల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి.
కానీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్లు నష్టపోయాయి.
రంగాలవారీగా చూస్తే పవర్, యుటిలిటీ, ఐటీ, రియల్టీ, టెక్ రంగ షేర్లు రెండు శాతం వరకు బలపడ్డాయి. కానీ, టెలికం, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్ రంగ సూచీలు నష్టపోయాయి.
గడిచిన మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,015 పాయింట్లు పెరిగినట్లు అయింది.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు పెరిగి 73.94 వద్ద ముగిసింది.