గత వారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్లో ర్యాలీతో నిఫ్టీ 458 పాయింట్లు పెరిగింది. అయితే ఇది తక్కువ వాల్యూమ్స్తో జరగడం, గురువారం నష్టపోయినా వాల్యూమ్స్ గరిష్ఠంగా ఉండటం.. ఈ ర్యాలీపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిఫ్టీ-50లో 20 కన్నా తక్కువ షేర్లలో మాత్రమే బలమైన ట్రెండ్ కనిపిస్తున్నది. పీఎస్యూ బ్యాంకులు, మెటల్స్, ఆటో, రియల్టీ రంగాల షేర్లలో మూమెంటమ్ ఊపందుకున్నది. బడ్జెట్కు మరో మూడు వారాలే ఉండటంతో ప్రీ-బడ్జెట్ ర్యాలీని కొనసాగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ శుక్రవారం డోజి క్యాండిల్ ఏర్పడటంతో ఈ వారం అనిశ్చితి కొనసాగే అవకాశాలే ఉన్నాయి. ప్రస్తుతానికి 50 రోజుల చలన సగటు 17,418 వద్ద, 20 రోజుల చలన సగటు 17,278 వద్ద ఉన్నాయి. మళ్లీ 17,278 స్థాయిని దిగకపోతే మరోసారి క్రితం కనీస స్థాయి 17,000ను తాకే అవకాశాలు మెరుగుపడతాయి. ఇక ఎఫ్ఐఐలు కొత్త సంవత్సరంలో కొనుగోళ్లను మళ్లీ ప్రారంభించడంతో మార్కెట్లో బేరిష్ ఛాయలు కనిపించడం లేదు. మార్కెట్ ఒకవేళ 17,944 స్థాయిని అధిగమించలేకపోతే కన్సాలిడేషన్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నది. బడ్జెట్ వరకు మార్కెట్లో నిర్ణయాత్మక ట్రెండ్ ఏదీ కనిపించకపోవచ్చు. ఇండియా సిమెంట్, గ్రాసిం, ఏసీసీ, అంబుజా సిమెంట్ షేర్లు బుల్లిష్గా ఉన్నాయి. పేజ్ ఇండస్ట్రీస్, ఐఆర్సీటీసీ, హిందాల్కో షేర్లూ పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఫైజర్, గ్రాన్యూల్స్, క్యాడిలా షేర్లు బలహీనంగా ఉన్నాయి.