ముంబై, అక్టోబర్ 12: బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లపట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో భారత స్టాక్ సూచీలు వరుసగా నాల్గో రోజు ర్యాలీ జరిపాయి. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 149 పాయింట్లు లాభపడి 60,284 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్లు ర్యాలీ జరిపి 17,992 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ స్థాయిల్లో సూచీలు ముగియడం ఇదే తొలిసారి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా టైటాన్ ఇండస్ట్రీస్ 5 శాతం పెరిగింది. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, నెస్లే ఇండియా, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు 2-4 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు హెచ్సీఎల్ టెక్నాలజీ, టెక్ మహింద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, సన్ఫార్మాలు నష్టాలతో ముగిసాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,095 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 345 పాయింట్లు లాభపడింది. నాలుగు రోజుల్లో రూ.6 లక్షల కోట్లు వరుసగా నాలుగురోజులపాటు జరిగిన మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.6,09,841 కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2,68,30,388 కోట్లకు చేరింది.