Stocks | దేశీయంగా బాండ్లు ధర సులభతరం కావడంతోపాటు గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. ఫలితంగా శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ పెరగడంతో.. గురువారం అమ్మకాల ఒత్తిడితో నష్టాలను చవి చూసిన స్టాక్స్కు శుక్రవారం ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 320 పాయింట్లు (0.49 శాతం) లబ్ధితో 65,828 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 115 పాయింట్లు పుంజుకుని 19,638 పాయింట్ల వద్ద నిలిచింది. ఇంట్రా డే ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 66,152, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19726 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకాయి.
హిందాల్కో 5.7 శాతం, ఎన్టీపీసీ సుమారు నాలుగుశాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, సిప్లా, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ ఒకటి నుంచి మూడు శాతం మధ్య లబ్ధి పొందాయి. మరోవైపు అదానీ ఎంటర్ ప్రైజెస్ 2.4 శాతం, ఎల్ అండ్ టీ మైండ్ ట్రీ, హెచ్సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ స్టాక్స్ నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ ఒక శాతానికి పైగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.6 శాతం లాభ పడ్డాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.7 శాతం, నిఫ్టీ మెటల్ రెండు శాతం, నిఫ్టీ పీఎస్యూ 1.6 శాతం లాభాలతో ముగిశాయి. ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి శుక్రవారం అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.83.04 వద్ద నిలిచింది.