Sensex | అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలివ్వడంతో దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఆల్టైం గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. అమెరికా ఫెడ్ రిజర్వు నెమ్మదిగా వడ్డీరేట్లు పెంచుతామని సంకేతాలివ్వడంతో గురువారం చివరి గంట సేపట్లో ఇన్వెస్టర్లకు స్టాక్స్ కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 62,412.33 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఇంట్రాడే ట్రేడింగ్లో సుమారు 900 పాయింట్లు దూసుకెళ్లి, 762.10 పాయింట్ల లబ్ధితో 62,272.68 పాయింట్ల వద్ద ముగిసింది.
దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.46 లక్షల కోట్లు లాభ పడి రూ.283.9 లక్షల కోట్లకు చేరుకుంది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 216.85 పాయింట్లు (1.19 శాతం) లాభంతో 18,484.10 పాయింట్ల వద్ద స్థిర పడింది. అంతకుముందు ట్రేడింగ్లో 18,529.70 పాయింట్ల గరిష్టాన్ని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ మరింత బలపడేందుకు కారణమైంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్పై 0.3 శాతం నష్టపోయి 85.13 డాలర్లు పలికితే, యూఎస్ క్రూడాయిల్ 0.2 శాతం నస్టంతో 77.74 డాలర్లు పలికింది.
అంతకు ముందు ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 225 పాయింట్లు, సౌత్ కొరియా కొస్పీ 0.96 శాతం లాభాలతో ముగిసాయి. చైనా షాంఘై కాంపోజిట్ 0.25 శాతం నష్టపోయింది. గత ట్రేడింగ్లో అమెరికా మార్కెట్లు లాభాలతో స్థిర పడ్డాయి. డోజోన్స్ ఇండస్ట్రీయల్ సగటున 1.08 శాతం, ఎస్ అండ్ పీ-500 0.59 శాతం, నాస్డాక్ 0.99 శాతం లాభ పడ్డాయి. థ్యాంక్స్ గివింగ్ హాలీడే నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గురువారం పని చేయవు.