న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: కొత్త ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్ లాభాలతో స్వాగతం పలికింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలిరోజైన శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 59,000 పాయింట్ల కీలకస్థాయిని అధిగమించింది. ఇంట్రాడేలో 828 పాయింట్ల మేర పెరిగిన ఈ సూచి ముగింపులో 708 పాయింట్ల పెరుగుదలతో 59,277 పాయింట్ల వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 206 పాయింట్లు ర్యాలీ జరిపి 17,670 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బ్యాంకింగ్, విద్యుత్ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. సెన్సెక్స్-30 షేర్లలో ఎన్టీపీసీ అత్యధికంగా 5.93 శాతం లాభపడింది. పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతి షేర్లు 2-5 శాతం మధ్య పెరిగాయి. సెన్సెక్స్ షేర్లలో కేవలం ఐదు షేర్లు-టెక్ మహీంద్రా, సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, ఇన్ఫోసిస్లు మాత్రమే నష్టాల్లో ముగిసాయి. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,914 పాయింట్లు, నిఫ్టీ 517 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ యుటిలిటీస్ ఇండెక్స్ భారీగా 3.44 శాతం జంప్చేసింది. పవర్ ఇండెక్స్ 3.16 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ సూచి 2.73 శాతం, రియల్టీ సూచి 2.34 శాతం చొప్పున పెరిగాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.71 శాతం, మిడ్ క్యాప్ సూచి 1.39 శాతం మేర పెరిగాయి.
విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు
కొద్ది వారాలుగా వరుస విక్రయాలు జరుపుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు గురువారం భారీగా రూ.3,089 కోట్ల విలువైన షేర్లను కొన్నట్టు స్టాక్ ఎక్సేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.