ముంబై, జూన్ 30 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పలు బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరిగే చర్చలపై అనిశ్చితి నెలకొనడం మదుపరుల్లో సెంటిమెంట్ను నీరుగార్చింది. ఒక దశలో 400 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 249.70 పాయింట్లు కోల్పోయి 76,478.67 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 80.50 పాయింట్లు కోల్పోయి 23,865.75 వద్ద స్థిరపడింది. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, బ్లూచిప్ సంస్థల షేర్లు కుప్పకూలడం మార్కెట్లో సెంటిమెంట్ను నీరుగార్చిందని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
సూచీల్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీ, టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్యూఎల్ షేర్లు భారీగా నష్టపోయాయి. కానీ, మారుతి, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు దిద్దుబాటునకు గురయ్యాయని, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ ట్రెండింగ్ను మరింత నష్టాల్లోకి నెట్టాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రంగాలవారీగా ఐటీ సూచీ అత్యధికంగా 2.62 శాతం నష్టపోగా, పీఎస్యూ బ్యాంకింగ్, మెటల్, యుటిలిటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ సూచీ నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ, రియల్టీ, సర్వీసెస్, కన్జ్యూమర్ డ్యూరబుల్, హెల్త్కేర్, క్యాపిటల్ గూడ్స్, కమోడిటీస్ రంగ సూచీలు లాభాల్లోకి వచ్చాయి.