ముంబై, జూలై 27: స్టాక్ మార్కెట్లలో ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో క్రయ విక్రయాలు అధికంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం పెంచడతో మదుపరుల్లో సెంటిమెంట్ నీరుగారింది. దీంతో బ్యాంకింగ్, వాహన రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ప్రారంభంలో 125 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 440.38 పాయింట్లు నష్టపోయింది. 66,266.82 వద్ద ముగిసింది. నిఫ్టీ 118.40 పాయింట్లు కోల్పోయి 19,659.90 వద్దకు జారుకున్నది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 351 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్ల చొప్పున పెరిగిన విషయం తెలిసిందే.
మహీంద్రా టాప్ లూజర్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా షేరు కుప్పకూలింది. మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు 6.39 శాతం నష్టపోయి టాప్ లూజర్గా నిలిచింది. ఆర్బీఎల్ బాయక్లో 10 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్న మహీంద్రా ప్రకటించడమే షేరు పతనానికి ప్రధాన కారణమైంది. దీంతోపాటు టెక్ మహీంద్రా, నెస్లె ఇండియా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్లు నష్టపోయాయి. కానీ, సన్ ఫార్మా, టాటా మోటర్స్, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీ, ఇన్ఫోసిస్లు రెండు శాతం వరకు పెరిగాయి. రంగాలవారీగా చూస్తే ఆటో ఇండెక్స్ 1.28 శాతం, ఆయిల్అండ్ గ్యాస్ 1.09 శాతం, బ్యాంకింగ్, ఎనర్జీ రంగ షేర్లు నష్టపోగా..కానీ, హెల్త్కేర్, రియల్టీ, టెలి కమ్యూనికేషన్స్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.
దెబ్బతీసిన ఆర్థిక ఫలితాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలు షేర్ల పతనానికి ఆజ్యంపోస్తున్నాయి. ఐటీ రంగ సంస్థల విశ్లేషకుల అంచనాలకు చేరుకోకపోవడంతోపాటు ఎఫ్ఎంసీజీ రంగ సంస్థలు కూడా అంతంత మాత్రంగానే నమోదు చేసుకుంటున్నాయి. దీంతో నెస్లె ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు పతనం చెందాయి. ఫెడ్ వడ్డీరేట్లను పెంచడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అలజడి సృష్టించిందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసుల హెడ్ నాయర్ తెలిపారు.