Stocks | భారత్ ద్వితీయ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్, నెలవారీ ఎక్స్పైరీ ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రారంభంలో స్వల్ప లాభాలతో ప్రారంభమైన బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ తదుపరి నష్టాల్లో కూరుకుపోయింది. తిరిగి చివర్లో స్టాక్స్ పుంజుకోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 87 పాయింట్ల లబ్ధితో సరిపెట్టుకున్నది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 20,100 పాయింట్లకు ఎగువన స్థిర పడింది.
నవంబర్లో బీఎస్ఈ సెన్సెక్స్ 30171 పాయింట్లు (4.8 శాతం) లాభ పడగా, మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 1053 (5.5 శాతం) లబ్ధితో 20,133 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24.17 లక్షల కోట్లు పుంజుకుని రూ.335.62 లక్షల కోట్లకు చేరుకున్నది.
కొత్తగా లిస్టయిన ఐఆర్ఈడీఏ 10 శాతం పుంజుకోగా, టాటా టెక్నాలజీస్.. లిస్టింగ్ ధర కంటే ఎక్కువగా రూ.1200 వద్ద స్థిన పడింది. 97 తేజా జెట్ ఫైటర్ విమానాలు, 156 ప్రచండ్ హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) నిర్ణయం తీసుకోవడంతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ షేర్ గరిష్టంగా పుంజుకున్నది. బీఎస్ఈలో 1898 స్టాక్స్ లాభ పడగా, 1810 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. 149 షేర్లు యధాతథంగా కొనసాగాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ 66,963 పాయింట్ల స్వల్ప లాభంతో మొదలైనా కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నది. తిరిగి మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చింది. అంతర్గత ట్రేడింగ్లో 66,610 పాయింట్ల కనిష్ట స్థాయి నుంచి 67,069 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుని తిరిగి 87 పాయింట్లతో 66,988 పాయింట్లతో ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 37 పాయింట్ల లబ్ధితో 20,133 పాయింట్ల వద్ద స్థిర పడింది.