అమెరికా డాలర్ ఇండెక్స్ రికార్డుగరిష్ఠస్థాయికి చేరడం, ఆ దేశపు రెండేండ్ల బాండ్ ఈల్డ్ 4.3 శాతానికి పెరగడంతో మన రూపాయి విలువ 82.4 స్థాయికి పతనమైనప్పటికీ, పండుగ సీజన్ ఆశలతో ఎన్ఎస్ఈ నిఫ్టీ గత వారం స్వల్ప లాభాల్ని ఆర్జించింది. 17,428పాయింట్ల గరిష్ఠస్థాయివరకూ పెరిగిన నిఫ్టీ చివరకు 221 పాయింట్ల లాభంతో 17,315 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ గత శుక్రవారం రాత్రి అమెరికా సూచీలు భారీ పతనాన్ని చవిచూడటంతో ఎస్జీఎక్స్ నిఫ్టీ ఇప్పటికే 200 పాయింట్లకుపైగా నష్టపోయింది. దీంతో ఈ వారం భారత్ మార్కెట్ గ్యాప్డౌన్తో ప్రారంభమవుతుందని విశ్లేషకులు తెలిపారు. అంతర్జాతీయ ట్రెండ్కు తోడు ఈ వారం కీలకమైన ద్రవ్యోల్బణం, ఐఐపీ డాటా వెలువడనుండటం, ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఆర్థిక ఫలితాలు వెల్లడికానుండటంతో సూచీలు ఒడిదుడుకులకు లోనవుతాయని వారు హెచ్చరిస్తున్నారు.
17,000 మద్దతు కీలకం
ఈ వారం నిఫ్టీకి 17,000 స్థాయి వద్ద కీలకమైన మద్దతు ఉందని, దీనిని కోల్పోతే మార్కెట్లో మరింత కరెక్షన్ వస్తుందని టెక్నికల్ అనలిస్ట్లు అంచనా వేస్తున్నారు. ఆప్షన్స్ విభాగంలోనూ 17,000 మద్దతుగా కన్పిస్తున్నదని, 17,400-17,500 శ్రేణి అవరోధం కల్గిస్తుందని 5పైసా.కామ్ రీసెర్చ్ హెడ్ రుచిత్ జైన్ తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్ల మొత్తం పొజిషన్లలో 80 శాతం షార్ట్సైడ్ ఉన్నాయని, దేశీ కస్టమర్ల పొజిషన్లలో 67 శాతం లాంగ్సైడ్ ఉన్నట్లు వివరించారు. ఈ వారం 17,000-17200 జోన్లో మద్దతు పొందవచ్చని ఏంజిల్ బ్రోకింగ్ టెక్నికల్ చీఫ్ అనలిస్ట్ సుమీత్ చౌహాన్ అంచనా వేశారు. 50 వారాల మూవింగ్ ఏవరేజ్ సంచరిస్తున్న 17,100 స్థాయి దిగువన ట్రేడవుతుంటే మూమెంటం బలహీనపడుతున్నట్లు భావించాలని ఈక్విటీరీసెర్చ్ ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ తెలిపారు. 17,300పైన స్థిరపడితే 17,600-17,700 వరకూ పెరిగే అవకాశాలుంటాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే చెప్పారు.