ముంబై, జనవరి 29: వరుసగా రెండు వారాలు పతనాన్ని చవిచూసిన స్టాక్ మార్కెట్ సోమవారం ఒక్కసారిగా దూకుడు ప్రదర్శించింది. ఫిబ్రవరి 1న లోక్సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో హఠాత్తుగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 1,241 పాయింట్లు పెరిగి 71,941 పాయిం ట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 385 పాయింట్లు లాభపడి 21,738 పాయింట్ల వద్ద నిలిచింది.
ప్రపంచ మార్కెట్లలో సానుకూల ట్రెండ్, మధ్యంతర బడ్జెట్పై అంచనాలతో దేశీయ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారని విశ్లేషకులు తెలిపారు. యూఎస్ సూచీలు ఏ రోజుకారోజు కొత్త రికార్డుస్థాయిల్ని చేరుతున్న ప్రభావం భారత్పై కూడా పడిందని వారన్నారు. ఆసియాలో సియోల్, టోక్యో, హాంకాంగ్ ఇండెక్స్లు లాభపడగా, యూరప్ స్టాక్స్ మిశ్రమంగా ముగిసాయి. సోమవారం దేశీయ ఫండ్స్ రూ. 3,220 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు రూ.110 కోట్ల స్వల్ప పెట్టుబడి చేశారు.
మధ్యంతర బడ్జెట్పై ఆశలు
ఇటీవలి క్షీణతతో తక్కువ ధరలో లభిస్తున్న క్వాలిటీ షేర్ల కొనుగోళ్లు జరిగాయని, మధ్యంతర బడ్జెట్పై ఆశావహ అంచనాలు మార్కెట్ సెంటిమెంట్ను మెరుగుపర్చినట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. గతవారం భారీ విక్రయాల అనంతరం సోమవారం సానుకూల అంతర్జాతీయ ట్రెండ్కు తోడు పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్ జరగడంతో మార్కెట్ ర్యాలీ చేసిందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు.
ఫెడ్ పాలసీ కీలకం
దేశీయ మార్కెట్ను ప్రభావితం చేసే అంతర్జాతీయ ట్రెండ్కు రానున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ కీలకమైనదని వినోద్ నాయర్ తెలిపారు. ఈ నెల 31న ఫెడ్ పాలసీ ప్రకటన వెలువడనున్నది. ఇప్పుడు రేట్ల కోత ఉండదుగానీ, తదుపరి నెలల్లో ఫెడ్ ఎలా వ్యవహరిస్తుందన్న సంకేతాలు ట్రెండ్ను నిర్దేశిస్తాయన్నారు. అమెరికాలో పటిష్ఠ ఆర్థిక గణాంకాలు వెలువడుతున్నందున, ఈ ఏడాది మార్చిలో వడ్డీ రేట్ల కోతపై మార్కెట్లు అంచనాల్ని తగ్గించుకుంటున్నప్పటికీ, ఈ ఏడాది ఎన్ని దఫాలు రేట్లను తగ్గించవచ్చన్న ఫెడ్ సంకేతాల కోసం ఇన్వెస్టర్లు ఆతృతతో ఎదురుచూస్తున్నారని నాయర్ వివరించారు. మధ్యంతర బడ్జెట్, ఫెడ్ పాలసీల సందర్భంగా మార్కెట్ కొంతమేర హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖెమ్కా చెప్పారు.
హెవీ ‘వెయిట్’ లిఫ్టింగ్
ప్రధాన హెవీవెయిట్ షేర్లు తాజా ర్యాలీలో కదంతొక్కాయి. సెన్సెక్స్లో 12 శాతం వరకూ వెయిటేజి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 7 శాతం లాభపడి దాదాపు 498 సెన్సెక్స్ పాయింట్లను జతచేసింది. మరో హెవీవెయిట్ లార్సన్ అండ్ టూబ్రో 3.25 శాతం ఎగిసి 106 సెన్సెక్స్ పాయింట్లను పెంచింది. ఈ రెండు షేర్లూ ఆల్టైమ్ రికార్డుస్థాయి వద్ద ముగియడం గమనార్హం. మిగిలిన సెన్సెక్స్ షేర్లలో టాటా మోటర్స్, పవర్గ్రిడ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్లు 2-3.5 శాతం మధ్య లాభపడ్డాయి.
మరోవైపు ఐటీసీ, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీస్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి. తాజా ర్యాలీలో హెవీవెయిట్ షేర్లతో పోలిస్తే చిన్న షేర్లు తక్కువగానే పెరిగాయి. సెన్సెక్స్ 1.76 శాతం లాభపడగా, బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.68 శాతం, స్మాల్ క్యాప్ సూచి 1.03 శాతం చొప్పున పెరిగాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఎనర్జీ ఇండెక్స్ 5.29 శాతం జంప్ చేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ 4.94 శాతం, పవర్ 3.03 శాతం, సర్వీసుల సూచి 2.82 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.13 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 1.93 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి. మరోవైపు ఎఫ్ఎంసీజీ, ఐటీ, టెక్నాలజీ ఇండెక్స్లు తగ్గాయి.
పాజిటివ్ ట్రెండ్
కొద్దిరోజులపాటు తీవ్ర ఒడిదుడుకులకు లోనైన నిఫ్టీ తాజా ర్యాలీలో కీలకమైన 20 రోజుల మూవింగ్ ఏవరేజ్ను (20 డీఎంఏ) తిరిగి అందుకున్నందున స్వల్పకాలికంగా ట్రెండ్ పాజిటివ్గా ఉంటుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే చెప్పారు. వచ్చే కొద్ది రోజుల్లో 22,100-22,150 శ్రేణి వరకూ పెరిగే అవకాశం ఉందని, లాభాల స్వీకరణ ఎదురైతే 21,550 పాయింట్ల స్థాయి తక్షణ మద్దతు అందించవచ్చని అంచనా వేశారు.
6 లక్షల కోట్లు పెరిగిన సంపద
సోమవారంనాటి ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా రూ.6 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ 6,08,556 కోట్లు పెరిగి రూ.3,77,20,679 లక్షల కోట్లకు (4.53 ట్రిలియన్ డాలర్లు) చేరింది.
రిలయన్స్ విలువ రూ.19.59 లక్షల కోట్లు
మూడేండ్ల తర్వాత అతిపెద్ద ర్యాలీ జరిపిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మార్కెట్ విలువ 19.59 లక్షల కోట్ల రికార్డుస్థాయిని తాకింది. సోమవారం ఇంట్రాడేలో ఈ షేరు బీఎస్ఈలో దాదాపు 7.34 శాతం పెరిగి రూ.2,9,05 వద్దకు చేరిన సమయంలో ఆర్ఐఎల్ విలువ రూ.19,59, 444 కోట్లకు చేరింది..చివరకు ఈ షేరు 6.86 శాతం లాభంతో చరిత్రాత్మక గరిష్ఠస్థాయి రూ.2,896 వద్ద నిలిచింది. ఆర్ఐఎల్ షేరు పెరగడం ఇది వరుసగా మూడో రోజు. ఈ మూడు రోజుల్లో రూ.1,25, 591 కోట్ల మార్కెట్ విలువను పెంచుకుంది. 2020 మార్చి తర్వాత ఇంత భారీ గా షేరు పెరగడం ఇదే తొలిసారి.