ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ( Stock markets ) ఇవాళ భారీగా నష్టపోయాయి. గత వారం కొత్త రికార్డులు నెలకొల్పుతూ లాభాల్లో దూసుకెళ్లిన మార్కెట్లు.. ఈ వారం తొలిరోజే నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. ఇటీవల సూచీలు భారీ లాభాలు చవిచూసిన నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం కూడా మరో కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవాళ్టి ట్రేడింగ్లో ముఖ్యంగా మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్ 500 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ సైతం కీలకమైన 17,400 పాయింట్ల మార్కు దిగువన ముగిసింది. ఉదయం 58,647 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపు లాభాల్లోకి వెళ్లినా చివరికి 524.96 పాయింట్లు నష్టపోయి 58,490 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 188.30 పాయింట్లు కోల్పోయి 17,396 వద్ద స్థిరపడింది.