ముంబై, మే 12: ద్రవ్యోల్బణం దెబ్బకు స్టాక్ మార్కెట్లు కకావికలమయ్యాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. అమెరికా ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకోవడంతో ప్రపంచ మార్కెట్లలో అలజడి సృష్టించింది. ఇప్పటికే ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచగా..తాజాగా మరోసారి పెంచే అవకాశాలున్నట్లు వచ్చిన సంకేతాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా దేశీయ సూచీలు కూడా తీవ్ర నష్టాల పాలయ్యాయి. రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి పతనం కూడా మార్కెట్ల పతనానికి ఆజ్యంపోసింది. వరుసగా ఐదోరోజు గురువారం 30 షేర్ల ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 1,158.08 పాయింట్లు లేదా 2.14 శాతం తగ్గి రెండు నెలల కనిష్ఠ స్థాయి 52,930.31కి జారుకున్నది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 359.10 పాయింట్లు లేదా 2.22 శాతం పతనం చెంది 15,808 వద్ద ముగిసింది.
ఇండస్ఇండ్ బ్యాంక్ 5.82 శాతం తగ్గి టాప్ లూజర్గా నిలిచింది. దీంతోపాటు టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టైటాన్, ఎల్అండ్టీ షేర్లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి.
హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్లు మార్కెట్ల పతనాన్ని అడ్డుకోలేకపోయాయి.
దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో శుక్రవారం మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకునే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
బీఎస్ఈ మిడ్క్యాప్ 2.24 శాతం, స్మాల్క్యాప్ 1.96 శాతం తగ్గాయి.
రంగాలవారీగా చూస్తే పవర్ అత్యధికంగా 4.11 శాతం పతనమయ్యాయి. యుటిలిటీస్ 3.90 శాతం, మెటల్ 3.75 శాతం, బ్యాంక్ 3.14 శాతం చొప్పున తగ్గాయి.
2,614 స్టాక్స్ క్షీణించగా, 747 షేర్లు మాత్రం పెరిగాయి.
19 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయిన వారిపై ద్రవ్యోల్బణం పిడుగు పడింది. ఈ దెబ్బకు గురువారం ఒకేరోజు రూ.5 లక్షల కోట్ల స్థాయిలో సంపదను కోల్పోయారు. మొత్తంగా గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో మదుపరులు ఏకంగా రూ.18.74 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.18,74,689.98 కోట్లు కరిగిపోయి రూ.2,40,90,199.39 కోట్లకు పతనమైంది.