Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పవనాలతో సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఆ తర్వాత ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 71,907.75 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలవగా.. ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో 71,999.47 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. ఓ దశలో 71,543.19 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 63.47 పాయింట్లు లాభంతో 71,721.18 ముగిసింది. నిఫ్టీ 28.50 పాయింట్లు పెరిగి 21,647.20 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్లో 2,022 షేర్లు పురోగమించగా.. 1,251 షేర్లు పతనమయ్యాయి. మరో 63 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్యూఎల్, విప్రో నష్టపోయాయి. బీఎస్ఇ క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ ఒకశాతం, బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 0.5 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు ఒక్కొక్కటి చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.7 శాతం పెరిగాయి.