న్యూఢిల్లీ, నవంబర్ 15: బ్యాంకింగ్, ఎనర్జీ షేర్ల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం కొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. 249 పాయింట్లు పెరిగిన సూచీ 61,873 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిరుడు అక్టోబర్ 19న నమోదైన 62,245 పాయింట్ల ఆల్టైం రికార్డుస్థాయికి మరో 0.58 శాతం దూరంలో ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో సెన్సెక్స్ ముగియడం ఇదే ప్రధమం. ఇంట్రాడేలో ఇది 61,955 పాయింట్లస్థాయిని తాకింది. మరో వైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో 18,403 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ ఆల్టైం రికార్డుస్థాయి 18,604 పాయింట్లు కాగా, 18,477 పాయింట్ల స్థాయిపైన ముగిస్తే రికార్డు నెలకొల్పినట్లవుతుంది. అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం 7 శాతం దిగువకు తగ్గడంతో దేశీ మార్కెట్లో తాజా ర్యాలీ జరిగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
పవర్గ్రిడ్ టాప్ గెయినర్
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా పవర్గ్రిడ్ 2.20 శాతం పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, టైటన్, మహీంద్రా, హెచ్డీఎఫ్సీ ద్వయం స్వల్పంగా లాభపడ్డాయి. బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, రిలయన్స్, సన్ఫార్మా, నెస్లే ఇండియాలు స్వల్ప నష్టాల్ని చవిచూశాయి.