ముంబై, ఏప్రిల్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు రూపాయి కరెన్సీకి మరిన్ని చిల్లులు పడటం మార్కెట్ల పతనాన్ని శాసించాయి. బ్లూచిప్ సంస్థల షేర్లను మదుపరులు విక్రయించడం కూడా మార్కెట్లో సెంటిమెంట్ను నిరాశపరిచింది. పారిశ్రామిక ప్రగతి, ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలకానుండటంతో మదుపరులు ముందస్తుగా విక్రయాలకు మొగ్గుచూపారు. ఫలితంగా 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 388 పాయింట్లు తగ్గి 58,576.37 వద్దకు జారుకున్నది. ఇంట్రాడేలో 666 పాయింట్లు లేదా 1.12 శాతం నష్టపోయిన సూచీ చివర్లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో భారీ నష్టాల నుంచి కోలుకున్నది. నిఫ్టీ కూడా 144.65 పాయింట్లు పతనం చెంది 17,530.30 వద్ద స్థిరపడింది.
టాటాస్టీల్, టెక్ మహీంద్రా, విప్రో, భారతీ ఎయిర్టెల్లు రెండు శాతానికి పైగా పతనం చెందాయి.
రిలయన్స్, ఎల్అండ్టీ, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎస్బీఐ, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రెడ్డీస్, టీసీఎస్, టైటన్ల షేర్లు తగ్గుముఖం పట్టాయి.
కానీ, యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, పవర్గ్రిడ్, మారుతి, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రాల షేర్లు బలపడ్డాయి.
30 షేర్ల ఇండెక్స్లలో 21 షేర్లు నష్టపోగా, మిగతా షేర్లు లాభపడ్డాయి.
రంగాలవారీగా చూస్తే బ్యాంకింగ్, మెటల్, ఎనర్జీ, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, బేసిక్ మెటిరీయల్ మూడు శాతం వరకు నష్టపోయాయి.
గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 871 పాయింట్లు, నిఫ్టీ 255 పాయింట్ల చొప్పున పతనం చెందాయి.