ముంబై, నవంబర్ 28: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. చివరి గంటలో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సూచీలు కోలుకున్నాయి. వాహన, పవర్, మెటల్ షేర్లు మెరవడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడంతో సెన్సెక్స్ తిరిగి 66 వేల మార్క్ను అధిగమించింది. 66,256 నుంచి 65,906 పాయింట్ల శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 204.16 పాయింట్లు అందుకొని 66,174.20 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 95 పాయింట్లు అందుకొని 19,889.70 వద్ద స్థిరపడింది.
టాటా గ్రూపునకు చెందిన షేర్లు కదంతొక్కాయి. ముఖ్యంగా టాటా మోటర్స్ షేరు అత్యధికంగా లాభపడి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ల షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ఐటీసీ, హిందుస్థాన్ యునిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే యుటిలిటీ 3.64 శాతం, పవర్ 3.47 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 3.13 శాతం, ఎనర్జీ 2.27 శాతం, సేవలు 2.02 శాతం, కమోడిటీ 1.27 శాతం, మెటల్ 1.13 శాతం చొప్పున అధికమయ్యాయి. కానీ, ఎఫ్ఎంసీజీ, ఇండస్ట్రీయల్స్, టెలికమ్యూనికేషన్స్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోయాయి.
అదానీ షేర్లు కదంతొక్కాయి. సుప్రీంకోర్టులో అదానీ గ్రూపునకు అనుకూలంగా తీర్పువచ్చే అవకాశం ఉండటంతో అదానీ గ్రూపు షేర్లు 20 శాతం వరకు లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్లో లిైస్టెన 10 సంస్థల్లో లాభాల్లో ముగియడం విశేషం. అత్యధికంగా అదానీ టోటల్ గ్యాస్ 20 శాతం లాభపడగా, అదానీ ఎనర్జీ సొల్యుషన్స్ 19 శాతం, అదానీ పవర్ 12.32 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 12.27 శాతం, ఎన్డీటీవీ 11.73 శాతం, అదానీ విల్మార్ 9.96 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 8.66 శాతం చొప్పున పెరిగాయి. అలాగే అదానీ పోర్ట్స్ 5.20 శాతం, అంబుజా సిమెంట్ 4.22 శాతం, ఏసీసీ సిమెంట్ 2.62 శాతం చొప్పున లాభపడ్డాయి. దీంతో ఈ పది సంస్థల మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయలు పెరగడంతో మొత్తం గ్రూపు విలువ రూ.11.31 లక్షల కోట్లకు చేరుకున్నది. గత శుక్రవారం ఇది రూ.10.26 లక్షల కోట్లుగా ఉన్నది.
బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ మరో రికార్డును సొంతం చేసుకున్నది. ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న కంపెనీల నికర విలువ 4 లక్షల కోట్ల డాలర్లకు చేరువైంది. మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో లిైస్టెన సంస్థల నికర విలువ రూ.331 లక్షల కోట్లకు చేరుకున్నది. చివరకు రూ.3,31,05, 425.71 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.34 ఆధారంగా చూస్తే కంపెనీల విలు 3.97 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. మే 24, 2021న బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ 3 లక్షల కోట్ల డాలర్లు దాటిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 15న సెన్సెక్స్ చారిత్రక గరిష్ఠ స్థాయి 67,927.23ని తాకిన విషయం తెలిసిందే.