న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల్లు (ఎఫ్పీఐలు), వాటి అనుబంధ సంస్థల ఉద్యోగులమంటూ కొంతమంది మోసపూరిత ట్రేడింగ్ స్కీములను ఆఫర్ చేస్తున్నారంటూ ఇన్వెస్టర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ హెచ్చరించింది. సెబీ రిజిస్టర్డ్ ఎఫ్పీఐల సంబంధితమైనవంటూ ప్రచారం చేసుకుంటున్న మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్ఫాంలపై తమకు పలు ఫిర్యాదులు అందాయని, అవి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐలు) సబ్ అకౌంట్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ అకౌంట్స్ ద్వారా ట్రేడింగ్ అవకాశాల్ని ఆఫర్ చేస్తున్నాయని సోమవారం సెబీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్లు, స్టాక్ మార్కెట్లో మెంటార్షిప్ ప్రొగ్రాములు అందిస్తామంటూ వాట్సప్, లైవ్ బ్రాడ్కాస్ట్లతో ప్రచారం చేసి అమాయక ఇన్వెస్టర్లకు వల వేస్తున్నట్టు వివరించింది. అంతేకాకుండా ఆ మోసపూరిత వ్యక్తులు అధికారిక ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ లేకుండానే అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని షేర్ల కొనుగోలు, ఐపీవోలకు దరఖాస్తు చేయడం వంటివి అనుమతిస్తామంటున్నారని సెబీ తెలిపింది. ఈ కార్యకలాపాలు నకిలీ పేర్లతో రిజిష్టరైన మొబైల్ నంబర్ల ద్వారా నిర్వహిస్తున్నారన్నది. దేశీయ ఇన్వెస్టర్లు సెక్యూరిటీ మార్కెట్లో చేసే పెట్టుబడులకు సంబంధించి ఎఫ్పీఐలకు ఏ సరళీకరణలూ లేవన్నది.