న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించాలని చూస్తున్న కంపెనీలకు గొప్ప ఊరట దక్కింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అప్రూవల్స్కున్న చెల్లుబాటు గడువును పొడిగించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30దాకా పొడిగిస్తున్నట్టు మంగళవారం పేర్కొన్నది. అలాగే కనీస పబ్లిక్ షేర్హోల్డింగ్ (ఎంపీఎస్) నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలకు వన్-టైం సడలింపును కూడా ఇచ్చింది. మార్కెట్లో ప్రస్తుతమున్న ఒడిదుడుకులతో చాలా సంస్థలు పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సందేహిస్తున్నాయి. సూచీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నది చూస్తూనే ఉన్నాం.
దీంతో ఈ సమయంలో నిధుల సమీకరణ ఆశించిన స్థాయిలో సత్ఫలితాలివ్వదని చాలా సంస్థలు తమ ఐపీవో ప్రణాళికల్ని వాయిదా వేయాలనుకుంటున్నాయి. అయితే దరఖాస్తుల్ని పరిశీలించిన సెబీ ఐపీవోలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో గడువు తీరిపోతుందేమోనన్న భయాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఐపీవో అప్రూవల్స్ గడువు తీరిపోతున్న కంపెనీలకు సెప్టెంబర్ 30దాకా ఐపీవోకు వెళ్లే అవకాశం ఉంటుందని సెబీ చెప్పింది. అంతేగాక ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో ఉన్న సంస్థలు.. ఏప్రిల్ 1-సెప్టెంబర్ 30 మధ్య ఎంపీఎస్ నిబంధనల్ని పాటించాలన్న డెడ్లైన్నూ సడలించింది. ఎలాంటి జరిమానాలు ఉండబోవన్నది. కరోనా వైరస్ సమయంలోనూ సెబీ ఇలాంటి సడలింపే ఇచ్చిన విషయం తెలిసిందే.