SEBI-Zee | జీటీవీ ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గట్టి షాక్ ఇచ్చింది. జీ ఎంటర్ టైన్ మెంట్ కు చెందిన పునీత్ గోయెంకా, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర గోయెంకాలు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయా సంస్థల్లో డైరెక్టర్ పదవుల్లో గానీ, ఎటువంటి కీలక పోస్టుల్లో గానీ ఉండరాదని నిషేధించింది.
సుభాష్ చంద్ర గోయెంకా, పునీత్ గోయెంకా ద్వయం.. 2019లో జీ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్లుగా తమ అధికారాలను దుర్వినియోగం చేసినట్లు సెబీ దర్యాప్తులో తేలింది. జీ ఎంటర్టైన్మెంట్ నిధులను వారిద్దరూ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని తేలిందని సెబీ పేర్కొంది. అందువల్లే తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వారు సుభాష్ చంద్ర గోయెంకా, పునీత్ గోయెంకాలను డైరెక్టర్ పోస్టుల్లో గానీ, కీలక పోస్టుల్లో ఉండరాదని సెబీ తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అయితే జీ ఎంటర్టైన్మెంట్ సంస్థలో ప్రమోటర్ల కుటుంబానికి కేవలం 3.99 శాతం వాటా మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకా తమ రోజువారీ విధుల్లో కొనసాగవచ్చునని తెలుస్తున్నది.
దర్యాప్తు కొనసాగుతుండగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు లిస్టెడ్ కంపెనీల్లో డైరెక్టర్లుగా, కీలక పదవుల్లో కొనసాగడం వల్ల కంపెనీ, అందులోని వాటాదారుల ప్రయోజనాలు దెబ్బ తింటాయని సెబీ హోల్ టైం సభ్యుడు తన ఇంటరిమ్ ఆదేశాల్లో పేర్కొన్నారు. కంపెనీలు, వాటి ఇన్వెస్టర్లు, ఇతర వాటాదారుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
కంపెనీలో ఆర్థిక లావాదేవీలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 2019 నవంబర్లో జీ ఎంటర్ టైన్ మెంట్ స్వతంత్ర డైరెక్టర్లు సునీల్ కుమార్, నిహారిక వోహ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. బోర్డు ఆమోదం లేకుండానే ఎస్సెల్ గ్రూపు అనుబంధ సంస్థల రుణాలకు గ్యారంటీలు ఇవ్వడంపై నిహారిక వోహ్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జీ ఎంటర్ టైన్ మెంట్, ఎస్సెల్ గ్రూపు ఆర్థిక లావాదేవీలపై సెబీ దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా తమ ఆదేశాలపై 21 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పునీత్ గోయెంకా, సుభాష్ చంద్ర గోయెంకాలను సెబీ ఆదేశించింది.